బెంగళూరు: అసోం తరహాలో కర్నాటకలోనూ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కార్ ఆలోచిస్తోంది. రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ దేశమంతటా ఎన్ఆర్సీని అమలు చేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. బోర్డర్ దాటి కర్నాటకకు వచ్చి చాలా మంది సెటిల్ అవుతున్నారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని మేం సేకరిస్తున్నాం. కేంద్ర హోంమంత్రితో చర్చించిన తర్వాత దీనిపై ముందుకు వెళతాం’’ అని బొమ్మై మీడియాకు వివరించారు.బుధవారం కూడా బొమ్మై హవెరీలో మీడియాతో మాట్లాడుతూ…ఎన్ఆర్సీ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్ఆర్సీపై ఇప్పటికే రెండు సార్లు మీటింగ్స్ జరిగాయని, కొన్ని రాష్ట్రాలు దీనికి అంగీకరించాయని ఆయన అన్నారు. ‘‘ఎన్ఆర్సీ చట్టాన్ని స్టడీ చేయాలని సీనియర్ ఆఫీసర్లను ఆదేశించా. బెంగళూరు, ఇతర పెద్ద సిటీలకు విదేశీయులు వచ్చి స్థిరపడుతున్నారు. వాళ్లు నేరాలకు పాల్పడుతున్నట్టు మా నోటీసుకు వచ్చింది. కొంతమందిని అరెస్టు చేశాం. ఈ వారంలోనే ఎన్ఆర్సీపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటాం. ’’ అని మంత్రి బొమ్మై వివరించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారి సంఖ్య బెంగళూరులో పెరుగుతోందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ బీజేపీ గట్టిగా తన గొంతును వినిపించిన విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు.
అమిత్ షా ఏమన్నారంటే?
దేశమంతటా ఎన్ఆర్సీ కసరత్తు జరుగుతోందని ఈమధ్యనే కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యాయమైన మార్గాల ద్వారానే అక్రమ చొరబాటుదారుల్ని దేశం నుంచి పంపించేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నేషనల్ సెక్యూరిటీ కోసం ఎన్ఆర్సీ తప్పనిసరి అని కూడా ఆయన ఈమధ్య కోల్కత్తా మీటింగ్లో స్పష్టంచేశారు. రెఫ్యూజీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తామని ఆయన ప్రకటించారు.
- మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ఎన్ఆర్సీను వ్యతిరేకిస్తోంది.
- బీజేపీ పాలనలో ఉన్న హర్యానా కూడా రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలుచేస్తామని ఇప్పటికే ప్రకటించింది.
- దేశంలో అసోంలో మాత్రమే ఎన్ఆర్సీని అప్డేట్ చేశారు. ఆగస్టు 31న పబ్లిష్ చేసిన ఫైనల్ రిపోర్ట్లో సుమారు 19 లక్షల మంది పేర్లను తొలిగించారు. వీళ్లలో 12 లక్షల మంది హిందువులు ఉన్నారు.