
Mumbai Train Accident: ముంబైలోని ముంబ్రా స్టేషన్ నుంచి దివా స్టేషనుకు ప్రయాణిస్తున్న రైలులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణ సమయంలో రైలు నుంచి 13 మంది కిందకు జారిపడిపోగా వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించటం అందరినీ కలచివేసింది. అయితే ప్రయాణికులు రైలు బోగీ ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
నేడు ముంబైలో జరిగిన ప్రమాదంలో భారతీయ రైల్వే సంస్థ కీలక ప్రకటన చేసింది. రైల్వే బోర్డు తాజా ప్రమాదం తర్వాత రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ముంబై లోకల్ రైళ్లలోని అన్ని బోగీల డోర్లను ఆటోమెటిక్ గా క్లోజ్ అయ్యేలా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ఉన్న రైళ్లలో మార్పులు చేపడతామని, కొత్తగా తయారు చేసే రైలు బోగీల్లో కూడా ఆటోమెటిక్ డోర్లు ఉండనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయనున్నట్లు రైల్వే సంస్థ ప్రతినిధి ప్రకటించారు.
ALSO READ | ముంబైలో ఘోర విషాదం.. లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్
ప్రమాదానికి సంబంధించిన వివరాలను రైల్వే గార్డు అందించటంతో వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే సంస్థ తెలిపింది. రానున్న కాలంలో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఆటోమెటిక్ డోర్లను కొత్త ట్రైన్లలో తీసుకొస్తున్నట్లు సెంట్రల్ రైల్వేస్ సీపీఆర్వో స్వప్నిల్ నీలా వెల్లడించారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం రైలులో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించటం వల్ల ఏర్పడిన రద్దీనే కారణంగా చెప్పారు.
రెండు దిక్కుల్లో ప్రయాణిస్తున్న వేరువేరు రైళ్లలో ఫుట్ పాత్ పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒకరికొకరు తగలటమే ప్రమాదానికి కారణంగా ఒక పాసింజర్ వెల్లడించారు. వాస్తవానికి రెండు రైళ్ల మధ్య 1.5 నుంచి 2 మీటర్ల మధ్య గ్యాప్ ఉంటుందని తెలిసిందే. అయితే వంపుల వద్ద రైలు కొద్దిగా ఒరగటం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం తర్వాత లోకల్ రైళ్లకు డోర్ల క్లోజింగ్ వ్యవస్థను తీసుకురావటం ప్రయాణికులు అదుపుతప్పి కిందపడటం లాంటి ప్రమాదాలను అరికట్టనుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.