వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జేపి నడ్డాతో రాజకీయ అంశాలు చర్చించలేదని, రాష్ట్రంలో పరిస్థితులు మాత్రమే చర్చకు వచ్చాయన్నారు. జులై 29 నుంచి పార్లమెంట్ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటి సమావేశాలు ప్రారంభం అవుతాయి కావున కమిటీ అధ్యక్షుడిగా.. సమావేశంలో చర్చించిన అంశాలు,విధివిధానాలు పై నడ్డాతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఇదే అంశంపై సూచనలు కోరానన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సంగతి తనకు తెలియదని, తనకు మాత్రం భద్రత లేదని చెప్పారు.” మా వాళ్ళు పార్టీ నుంచి వెలేశారు. నేను మాత్రం పార్టీలోనే ఉంటాను. పార్టీని వదిలి వెళ్ళను. పార్టీకి, ముఖ్యమంత్రికి విధేయుడిని. పార్లమెంట్ లో నా స్థానం మార్చుకోగలరు కానీ ఏమీ చేయలేరు. పార్లమెంట్ లో నా స్థానం మార్చడం వల్ల నన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు” అని ఎంపీ అన్నారు.
లోక్సభలో తన సీటు మార్పు మీద మాట్లాడుతూ.. “నాపై అనర్హత పిటిషన్ సాధ్యం కాదు కాబట్టి పార్లమెంట్ లో సీటు మార్చి సంతోషపడాలని చూస్తున్నారు. సీటు మార్చడం వల్ల నాకు నష్టం లేదు..చివరి వరుసలో ఇచ్చినా నష్టం లేదు. పార్లమెంటులో మంచి పనితీరు కనబరచడమే నా పాలిట శాపంగా మారింది. నా సాయశక్తుల ప్రజాసమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతా. జులై 21న రాష్ట్రపతిని కలిసి నా భద్రత కల్పించకపోవడాన్ని రాష్ట్రపతికి వివరిస్తా” అని రఘురామకృష్ణంరాజు మీడియాకి తెలిపారు.