
ఏజెంట్ల మోసానికి సౌదీలో చిక్కుకుని.. ఒంటెల కాపరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన వీరయ్య పంపిన సెల్ఫీ వీడియో.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కదలించింది. ఇదే తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మరో యువకుడు సౌదీ ఎడారిలో పడుతున్న ఇబ్బందులు చెబుతూ సెల్ఫీ విడుదల చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ అనే యువకుడు.. సౌదీ నుంచి ఒక సెల్ఫీ వీడియో పంపించాడు .. వీడియోలో తానను ఏజెంట్ మోసం చేశాడని, సౌదీలో నరకయాతన పడుతున్నానని చెప్పాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక, బంధువు సాయంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాహీద్ అనే ఏజెంట్ ద్వారా వీసా పొంది సౌదీకి వచ్చానన్నారు. ఏజెంట్ వాహిద్ కు 83 వేలు చెల్లించానని చెప్పాడు మహ్మద్ సమీర్..
ఏప్రిల్ 17 న సౌదీ వెళ్లానన్న మహ్మద్ సమీర్ … అక్కడి విమానశ్రయం నుంచి నేరుగా ఎడారి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా పనిచేయాలని చెప్పారన్నారు. వెళ్లే ముందు ఫంక్షన్ హాల్ లో పని అని చెప్పి.. ఇప్పుడు గొర్లకాపరిగా ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కొడుతున్నారని, సరిగా తిండి పెట్టడంలేదన్నారు. కడుపు నిండాతిని 20 రోజులైందన్నాడు. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని వీడియోలో వేడుకుంటున్నాడు మమ్మద్ సమీర్.