ఆ శక్తినిచ్చింది వ్యవసాయమే

ఆ శక్తినిచ్చింది  వ్యవసాయమే

మైసూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంపొటి ఎస్టేట్​కి వెళ్తే.. దారి పొడుగునా పచ్చని చెట్లే పలకరిస్తాయి. చల్లటి గాలులు సేదదీరుస్తాయి. ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల పైనుంచి కోయిలలు జోల పాటలు పాడతాయి. ఇక్కడ కోకో, జాజికాయ, వక్క లాంటి చెట్లు కూడా ఉన్నాయి. మొత్తం17, 000 చెట్లతో నందనవనంగా ఉండే ఈ ఎస్టేట్​కి​ మరో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ పంటలన్నీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తారు. దానికి ప్రత్యేకంగా ఓ కారణం ఉందంటున్నారు ఈ ఎస్టేట్​లో  సేంద్రియ సాగు చేస్తున్న తంకచన్​ చెంపొటి, అతని భార్య జెస్సీ. అదేంటంటే.

ఈ ఎస్టేట్​లో ఉన్న 22 ఎకరాల్లో భార్యతో కలిసి పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులు సాగు చేస్తున్న తంక​చన్ రిటైర్డ్​ ఉద్యోగి. కేరళ కోహికోడ్‌‌లోని తెక్కుంకుట్టిలో పుట్టిన ఇతనికి చిన్నప్పట్నించీ వ్యవసాయమంటే బోలెడంత ఇష్టం. చిన్నప్పుడే తండ్రితో కలిసి రోజూ పొద్దున్నే పొలానికెళ్లేవాడు​ . స్కూల్​ టైంకి తిరిగి ఇంటికొచ్చేవాడు. మళ్లీ సాయంత్రం స్కూల్​ నుంచి నేరుగా పొలానికే వెళ్లేవాడు. ఆ తర్వాత ఉద్యోగమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు తంక​చన్​. ముప్పై ఏండ్లు పెద్ద పెద్ద కార్పొరేట్​ కంపెనీల్లో పనిచేస్తూనే  తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత తన సంపాదనంతా కూడబెట్టి 22 ఎకరాల ఎస్టేట్​ కొన్నాడు. అలా 2005 లో తనకిష్టమైన వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. 

కెమికల్​ ఫ్రీ

తంక​చన్​ ఎస్టేట్​లో వ్యవసాయం మొదలుపెట్టకముందు అందులో వెనిలా ప్లానిఫోలియా, కొబ్బరి, సపోటా .. లాంటివి ఎక్కువగా సాగు చేసేవాళ్లు. మంచి దిగుబడి కోసం కెమికల్స్​తో నిండిన మందులు​ బాగా వాడేవాళ్లు. కానీ, ఆ పద్ధతిలో సాగు వద్దనుకున్నాడు తంక​చన్​. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నాడు. అందుకోసం మొదటగా తమ భూమిలో పేరుకుపోయిన కెమికల్స్​ అన్నింటినీ తీసేయాలనుకున్నాడు. దాన్ని కెమికల్​ ఫ్రీగా మార్చేందుకు సుభాష్​ పాలేకర్​ పద్ధతిని ఫాలో అయ్యాడు. ఆవు పేడ, మూత్రంతో పాటు మరికొన్ని నేచురల్​ ఇంగ్రెడియెంట్స్​తో జీవామృతం తయారు చేసి పొలంలో చల్లాడు. అలా తన ఐదేండ్ల కష్టం తర్వాత భూమి నుంచి కెమికల్స్​ అన్నీ వేరయ్యాయి. అయితే అందరిలా రొటీన్ పంటలు వద్దనుకున్నాడు తంక​చన్​. అలాగే వీలైనన్ని ఎక్కువ వెరైటీలు సాగు చేయాలనుకున్నాడు. అందుకోసం నాలుగు లేయర్ల మెథడ్​ని అప్లై చేశాడు. అలా మొదటి లేయర్​లో కొబ్బరి చెట్లు, రెండో లేయర్​లో వక్క, మూడులో కోకో, జామ, మామిడి లాంటి పండ్ల తోటలు,  నాలుగో లేయర్​లో అల్లం, పసుపు, మొరం(గెనుసు) గడ్డలు లాంటివి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తంక​చన్ ఎస్టేట్​లో  ముప్పై ఏండ్ల నాటి కొబ్బరి చెట్లు వెయ్యికి పైగా ఉన్నాయి. అలాగే నాలుగు వేల వక్క, మూడు వేల ఐదొందల కోకో మొక్కలతో పాటు చెర్రీ, పనస, నిమ్మజాతి పండ్లు చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పంటలతో ప్రొడక్ట్స్​ కూడా తయారుచేసి అమ్ముతారు ఈ జంట​​. చాలామంది రైతులు కోకో సీడ్స్​ని కేజీ 50 రూపాయల చొప్పున అమ్ముతుంటారు. కస్టమర్స్​ కూడా కేవలం సీడ్స్​ని మాత్రం వాడి మిగతా ఫ్రూట్​ని పడేస్తుంటారు. కానీ, వీళ్లు ఆ వేస్టేజ్​ని ఉపయోగించుకోవడానికి కోకోతో సిరప్, జ్యూస్​, వెనిగర్​, లడ్డూలు తయారుచేశారు. 

వాటిని మార్కెట్​లోకి తెచ్చారు. కోకో సిరప్​ని బ్రెడ్, చపాతీ, కేక్స్​లో కలుపుకోవచ్చు. వీటితో పాటు ఫ్రూట్​ జ్యూస్​, జామ్​, నిల్వ, రోటి పచ్చళ్లు కూడా అమ్ముతున్నారు. అయితే ఈ ఐడియా అంతా నా భార్య జెస్సీదే అంటాడు తంకచన్. సొంతంగా నేచురల్​ ప్రొడక్ట్స్​ని మార్కెట్​లోకి తీసుకురావాలని తన టీచర్​ ఉద్యోగాన్ని కూడా వదిలేసిందామె. 

లక్షల్లో సంపాదిస్తున్నారు

సాగు చేసిన పంటలతో తయారుచేస్తున్న ప్రొడక్ట్స్​ వల్ల ఐదింతలు ఎక్కువ లాభం వస్తుందట వీళ్లకు. ఒక్క కోకో ప్రొడక్ట్స్ ద్వారానే అన్ని ఖర్చులు పోను పది లక్షల రూపాయలు మిగులుతున్నాయట. మిగతా అన్ని పంటలు 25 లక్షల పైనే లాభం తెచ్చిపెడుతున్నాయట. లాభనష్టాలను పక్కనపెడితే ..‘‘ వ్యవసాయం నాకు ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తిని ఇచ్చింది​. కొత్త విజన్​ని పరిచయం చేసింది. పెరిగి పెద్దవుతున్న చెట్లను చూసిన ప్రతిసారీ 
నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’’ అంటున్నాడు తంకచన్. అంతేకాదు ఈ సేంద్రియ సాగుని స్పిరిచ్యువల్​ ఫార్మింగ్​ అని చెప్తున్నారు వీళ్లు.  నేచర్​తో ఎక్కువగా కనెక్ట్​ అవ్వడం వల్ల మొక్కల ఎమోషన్స్​ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారట ఈ జంట.