
- అహ్మదాబాద్లో ప్రమాద స్థలం నుంచి డివైస్ను స్వాధీనం చేసుకున్న అధికారులు
- అందులోని డేటాపైనే ఉత్కంఠ
- బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ
- తనిఖీచేసి రిపోర్టు ఇవ్వాలని ఎయిరిండియాకు ఆదేశం
- ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
- విమానం పేలుడుతో వెయ్యి డిగ్రీల టెంపరేచర్.. కాలి బూడిదైన మృతదేహాలు
- గుర్తించిన డెడ్బాడీలు ఆరే.. మిగతా వాటికి డీఎన్ఏ టెస్టులు
అహ్మదాబాద్ / న్యూఢిల్లీ: గుజరాత్లో ఎయిరిండియా విమానం ఎందుకు క్రాష్ అయింది? టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పైకి ఎగరలేక ఎందుకు కుప్పకూలిపోయింది? ఈ ప్రమాదానికి దారి తీసిన అసలు కారణాలేంటి? అన్నవి తేలాలంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ కావాల్సిందే! అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు వద్ద గురువారం మధ్యాహ్నం కుప్పకూలిన ఎయిరిండియా ఫ్లైట్కు సంబంధించి కీలకమైన బ్లాక్ బాక్స్ దొరికింది. విమానం కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పైనే దీనిని గుర్తించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శుక్రవారం ఈ బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుంది.
ప్రమాద సమయంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్), కాక్ పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) డేటా అత్యంత కీలకం కానుంది. విమానం స్పీడ్, ఎత్తు, ఇంజిన్ పనితీరు, తదితర సమాచారాన్ని డీఎఫ్ డీఆర్ రికార్డ్ చేస్తే.. కాక్ పిట్ లో జరిగే సంభాషణలు, శబ్దాలు, ఏటీసీతో పైలట్ జరిపే సంప్రదింపులను సీవీఆర్ రికార్డ్ చేస్తుంది. అందుకే వీటిని ఓపెన్ చేస్తేనే అసలు ఏం జరిగిందన్నది తెలియనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయిందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కాగా, ప్రమాద సమయంలో విమానంలో 1.2 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 1000 డిగ్రీలకుపైగా టెంపరేచర్ తో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎవరూ తప్పించుకోలేక.. కాలి బూడిదైపోయారు. కాగా, అహ్మదాబాద్లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిన నేపథ్యంలో ఈ విమానాల సామర్థ్యంపై రివ్యూ చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది.
జన్ ఎక్స్ ఇంజన్లతో కూడిన బోయింగ్ విమానాల్లో డీజీసీఏ ప్రాంతీయ అధికారులతో కలిసి 15 రోజుల్లో తనిఖీలు పూర్తి చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. కాగా, ఎయిరిండియా విమానం కూలిన ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిటీ సివిల్ ఆస్పత్రి వద్ద బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబసభ్యులను కూడా మోదీ పరామర్శించి, ఓదార్చారు.