
- మెరుగుపడనున్న ఉద్యోగుల పని సామర్ధ్యం
- అప్పులిచ్చే ముందు బ్యాంకులు సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతాయి: నీతిఆయోగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ:
ఇండియా జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) పెరగడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. ఏఐ వలన జీడీపీ 2035 నాటికి 500–600 బిలియన్ డాలర్లు (రూ.53 లక్షల కోట్లు) అదనంగా పెరుగుతుందని నీతిఆయోగ్ అంచనా వేస్తోంది. ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ రిపోర్ట్ను ఈ సంస్థ విడుదల చేసింది.
దీని ప్రకారం, ఏఐ వినియోగం వల్ల ఉద్యోగుల సామర్థ్యం, ఉత్పాదకత పెరగడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల 17–26 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వృద్ధిని చూడొచ్చు. భారత్లో పెద్ద సంఖ్యలో సైన్స్, టెక్నాలజీ నిపుణులు, ఆర్ అండ్ డీ వృద్ధి, డిజిటల్ సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి గ్లోబల్గా ఏఐ వలన పెరిగే జీడీపీలో 10–15 శాతం వాటా మన దేశం నుంచే ఉంటుందని అంచనా. అయితే, ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడినప్పటికీ, క్లరికల్, రొటీన్, తక్కువ నైపుణ్య ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉందని నీతిఆయోగ్ రిపోర్ట్ హెచ్చరించింది.
ఈ సెక్టార్లలో ఏఐ కీలకం..
ఫైనాన్షియల్ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 2035 నాటికి ఈ రంగాల్లో 20–25శాతం జీడీపీ ఏఐ ఆధారంగా ఉండొచ్చని అంచనా. ఏఐతో అనలిటిక్స్, ఫ్రాడ్ డిటెక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, క్రెడిట్ డెసిషన్, కలెక్షన్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో పనితీరు మెరుగవుతుంది.
బ్యాంకులు ప్రత్యామ్నాయ డేటా ఆధారంగా సరియైన రుణ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. ఏఐ వినియోగం ద్వారా 30–35 శాతం సామర్థ్య లోటును తగ్గించొచ్చని రిపోర్ట్ పేర్కొంది. దేశీయ వినియోగం, ఎగుమతుల మార్కెట్లలో ఈ ప్రభావం కనిపించనుందదని తెలిపింది. టెక్నాలజీ సేవల రంగంలో 15–20శాతం అదనపు వృద్ధి సాధ్యమవుతుందని అంచనా. తయారీ రంగంలో 85–100 బిలియన్ డాలర్ల వృద్ధిని సాధించొచ్చు.
8 శాతం వృద్ధి అవసరం
ఇండియా జీడీపీ 5.7శాతం వృద్ధి రేటుతో పెరిగితే 2035 నాటికి 6.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కానీ ‘వికసిత్ భారత్’ లక్ష్యాలని చేరుకోవాలంటే 8 శాతం వృద్ధి అవసరం. అదే సాధ్యమైతే జీడీపీ ఇంకో పదేళ్లలో 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరగలుగుతుంది. “ఏఐ వినియోగాన్ని నియంత్రించేలా చట్టాలు ఉండాలి. కానీ, ఇవి దీని పెరుగుదలను అడ్డుకోకుండా చూసుకోవాలి. ఏఐ అనేది డైనమిక్, రియల్ టైమ్ టెక్నాలజీ. దీన్ని సామాన్య ప్రజల ప్రయోజనానికి ఉపయోగించాలి” అని నీతిఆయోగ్ రిపోర్ట్ విడుదల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
సాండ్బాక్స్ విధానం ద్వారా నియంత్రణ, ఆవిష్కరణ మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “వికసిత్ భారత్ లక్ష్యానికి 8శాతం వృద్ధి అవసరం. ఇది సాధించాలంటే ఏఐ ఆధారిత ఆవిష్కరణలే కీలకం. బ్యాంకింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా సేవా నాణ్యత, పోటీ సామర్ధ్యాన్ని మెరుగుపరచొచ్చు. ఏఐ ఆధారంగా డ్రగ్ డిస్కవరీ, సాఫ్ట్వేర్తో నడిచే వాహనాలు వంటి రంగాల్లో భారత్ విస్తరించొచ్చు” అని అన్నారు.
“ఏఐ వినియోగంలో భారత్ కీలక మలుపులో ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా యువతకు నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సమస్యలను దీంతో పరిష్కరించాలి. ప్రభుత్వ–పరిశ్రమ–సమాజం కలిసి పని చేయాలి” అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.