- మనుషులంతా తాగే నీళ్లకంటే ఎక్కువే వాడనున్న ఏఐ డేటా సెంటర్లు
- యూఎన్వో తాజా నివేదిక హెచ్చరిక
- ఏఐ వ్యవస్థల ఎఫిషియెన్సీ పెరిగినా..
- వనరుల వాడకం మరింత పెరగొచ్చు
- కరెంట్, నీటి డిమాండ్, ఉద్గారాలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన
న్యూయార్క్: ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో త్వరలోనే కరెంట్, నీటి డిమాండ్ విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. వచ్చే నాలుగేండ్లలోనే అంటే.. 2030 నాటికల్లా ప్రపంచ విద్యుత్ వినియోగంలో దాదాపు 3% ఏఐ వ్యవస్థలకే ఖర్చు కావచ్చని.. ఏటా భూమిపై మనుషులంతా తాగే నీళ్ల కంటే ఎక్కువ నీళ్లే ఏఐ డేటా సెంటర్లకు అవసరం కావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా సెంటర్లతో విద్యుత్, నీటి వినియోగం పెరుగుతోందన్న ఆందోళనలను తోసిపుచ్చడం కోసం.. ఏఐ మోడల్స్ భవిష్యత్తులో మెరుగై, మరింత సమర్థవంతంగా మారడం వల్ల వాటికి తక్కువ వనరులు అవసరమవుతాయని తరచూ విశ్లేషణలు వస్తుంటాయి. కానీ, విద్యుత్, నీటి వినియోగ సామర్థ్యం ఎంత మెరుగుపడితే అంతగా వనరుల వినియోగం పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో స్పష్టం చేసింది. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే పర్యావరణ (వనరుల) ఖర్చులను లెక్కించి ఈ నివేదికలో వివరించింది. ఈ లెక్కల ప్రకారం, 2030 నాటికి ఏఐ విద్యుత్ వినియోగం రెట్టింపై, ప్రపంచ విద్యుత్తులో 3 శాతాన్ని వినియోగించుకోవచ్చని, కూలింగ్ కోసం ప్రపంచ జనాభా వార్షిక తాగునీటి అవసరాల కంటే ఎక్కువ నీటిని హరించివేయవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది.
టెక్నాలజీ మెరుగై.. పెరగనున్న వినియోగం
సాంకేతిక మెరుగుదల ఒక వనరు సామర్థ్యాన్ని పెంచినప్పుడు, ఆ వనరు మొత్తం వినియోగం తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుందని అంచనా వేసే ‘జెవోన్స్ పారడాక్స్’ అనే ఆర్థిక సూత్రాన్ని ఏఐ వినియోగం అనుసరిస్తుందని కూడా ఇది స్పష్టంచేసింది. ఏఐ మోడల్స్ చౌకగా, మరింత ఆకర్షణీయంగా మారుతున్నందున, ఇది కొత్త వినియోగాలను, అధిక పరిమాణంలో వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, సామర్థ్య పురోగతి వల్ల వచ్చే ఎలాంటి పొదుపునైనా క్షీణింపజేస్తుందని, బహుశా తుడిచిపెట్టేస్తుందని అభిప్రాయపడింది. ఈ ఉచ్చులో పడకుండా ఉండటానికి, పారదర్శకత, రూపకల్పన ద్వారా సామర్థ్యం, సమానత్వం, -న్యాయం, జీవిత చక్ర బాధ్యత, ప్రపంచ సహకారం, స్థిరమైన వినియోగం అనే మార్గదర్శక సూత్రాల ఆధారంగా బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి ఇది ఒక కార్యాచరణ ప్రణాళికను (రోడ్మ్యాప్) నిర్దేశించింది.
ఏఐతో దేశాల మధ్య డిజిటల్ విభజన..
2030 నాటికి విద్యుత్ వినియోగం రెట్టింపైనట్లయితే, దానికి సంబంధించిన కార్బన్ ఫుట్ప్రింట్ను భర్తీ చేయడానికి పదేళ్లలో 6.7 బిలియన్ల కొత్త చెట్లు అవసరమవుతాయి. డేటా సెంటర్లకు 9.3 ట్రిలియన్ లీటర్ల నీరు, మెక్సికో సిటీ పరిమాణానికి దాదాపు పది రెట్లు ఉన్న భూమి కూడా అవసరమవుతాయి. వనరుల వినియోగానికి అతీతంగా, కేవలం 32 దేశాలు మాత్రమే ఏఐ- నిర్దిష్ట క్లౌడ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం, ఆ సామర్థ్యంలో 90% అమెరికా, చైనాలో కేంద్రీకృతమై ఉండటంతో ఏఐ విజృంభణ మధ్యలో ఉన్న నిర్మాణపరమైన అసమానతను కూడా ఈ నివేదిక నొక్కి చెప్పింది. ఏఐ వ్యవస్థలను నిర్మించి, నియంత్రించే దేశాలకు, వాటిని వినియోగించే దేశాలకు మధ్య పెరుగుతున్న డిజిటల్ విభజన గురించి కూడా ఇది హెచ్చరించింది.
