న్యూఢిల్లీ: పాకిస్థాన్ గగనతలం నుంచి దూసుకువచ్చిన ఓ విమానం కలకలం రేపింది. అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది విమానాన్ని బలవంతంగా జైపూర్లో ల్యాండ్ చేయించారు. అయితే కరాచీ నుంచి ఢిల్లీకి వస్తున్న జార్జియాకు చెందిన ట్రాన్స్ పోర్ట్ విమానం రూట్ తప్పడంతోనే ఈ ఘటనకు కారణమైనట్లు తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కరాచీ నుంచి ఢిల్లీ వైపు వచ్చిన జార్జియాకు చెందిన ఏఎన్–12 ట్రాన్స్ పోర్ట్ విమానం అంతర్జాతీయ వైమానిక హద్దులను ఉల్లంఘించి..జైపూర్ దగ్గరలో ఇండియన్ బార్డర్లోకి ప్రవేశించింది. గుజరాత్ మీదుగా ఢిల్లీ వైపు దూసుకువచ్చింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలెట్లు సుఖోయ్–30 ఎంకేఐ ఫైటర్ జెట్స్తో వెంబడించి జైపూర్లో ల్యాండ్ చేయించారు. కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు ఏటీఎస్ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పయనించడమే ఈ ఘటనకు కారణమైంది. ఆ విమానం ఉక్రెయిన్కు చెందిన మోటార్సిచ్ అనే సంస్థకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఏముంది.. ఎందుకిలా జరిగిందో తెలుసుకునేందుకు విమాన సిబ్బందిని ప్రత్యేక బృందాలు ప్రశ్నిస్తున్నాయి.