
హైదరాబాద్, వెలుగు: ఇండియాలో రానున్న 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు, 41 వేల మంది పైలెట్లు, 47 వేల మంది టెక్నికల్ స్టాఫ్ అవసరమవుతారని ఎయిర్బస్ ఇండియా ఎండీ రేమి మెయిలార్డ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2024 కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఇండియా నుంచి ముడిసరుకులు, పార్టులను సేకరించడం డబుల్ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి వీటి విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు.
ప్రస్తుతం 750 మిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్లను ఇండియా నుంచి కంపెనీ సేకరిస్తోంది. కిందటేడాది ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీల నుంచి 750 విమానాల కోసం ఆర్డర్స్ వచ్చాయని, ఇందులో 75 విమానాలను డెలివరీ చేశామని రేమి వెల్లడించారు. 41 విమానాలు ఇండిగోకి, 19 ఎయిర్ ఇండియాకు, 14 విస్తారాకు, ఒకటి గో ఫస్ట్కు డెలివరీ చేశామన్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్స్లో ఏ350 విమానం కీలకంగా మారుతుందని, ఇలాంటి ఆరు విమానాలను కిందటేడాది ఎయిర్ ఇండియాకు డెలివరీ చేశామని చెప్పారు.
ఆకాశ ఎయిర్ 150 విమానాల ఆర్డర్...
ఆకాశ ఎయిర్ 150 విమానాల కోసం ఆర్డర్ పెట్టింది. బోయింగ్ నుంచి 737 మ్యాక్స్ 10, 737 మ్యాక్స్ 8–200 జెట్స్ను కొనుగోలు చేయనుంది. ఆకాశ ఎయిర్తో కలిపి ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీలు ఏడాది కాలంలోనే 1,120 విమానాల కోసం ఆర్డర్లు పెట్టాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో కలిసి 970 విమానాల కోసం బోయింగ్, ఎయిర్ బస్కు ఆర్డర్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీల దగ్గర 730 విమానాలు ఉన్నాయని, 2030 నాటికి వీటి సంఖ్య 1,500 నుంచి 2,000 కి పెరుగుతుందని కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఏవియేషన్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పారు.
అగ్రిమెంట్స్..
1) ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా కలిసి పైలెట్ ట్రెయినింగ్ సెంటర్ను గురుగ్రామ్లో ఏర్పాటు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్లో ఇరు కంపెనీలకు 50 : 50 శాతం వాటా ఉంటుంది.
2) కమర్షియల్ విమానాల విడిభాగాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, మహీంద్రా ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సేకరించేందుకు ఎయిర్ బస్ గురువారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎయిర్ బస్ ఏ320 నియో, ఏ330 నియో, ఏ350 విమానాల కోసం విడిభాగాలను సప్లయ్ చేయనున్నాయి.
3) ఎయిర్ బస్తో కలిసి జీఎంఆర్ గ్రూప్ ఏర్పాటు చేసిన జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ను జ్యోతిరాదిత్య సిందియా ప్రారంభించారు. ఈ స్కూల్ జీఏంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీయల్ పార్క్లో ఉంది.