- కట్టాల్సింది రూ. 13,004 కోట్లే మరో రూ. 5,000 కోట్లు అదనంగా కట్టాం : ఎయిర్టెల్
- ప్రభుత్వం లెక్కల ప్రకారం కట్టాల్సింది రూ. 35,000 కోట్లు ఇప్పటి వరకు కట్టింది రూ. 18,004 కోట్లు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి భారతీ ఎయిర్టెల్ మరో రూ. 8,004 కోట్లను శనివారం కట్టేసింది. దీంతో ప్రభుత్వానికి కట్టాల్సిన ఏజీఆర్ బకాయిలను క్లియర్ చేశామని పేర్కొంది. మేము వేసుకున్న లెక్కల ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు రూ. 13,004 కోట్లేనని తెలిపింది. కంపెనీ ఫిబ్రవరి 17 న డీఓటీకి రూ. 10,000 కోట్లను చెల్లించింది. మిగిలిన రూ. 3,004 కోట్లను శనివారం చెల్లించామని, అంతేకాకుండా అదనంగా మరో రూ. 5,000 కోట్లను కట్టామని పేర్కొంది. డీఓటీ వేసే లెక్కలకు తగ్గట్టుగా రీఫండ్ లేదా ఎడ్జెస్ట్మెంట్కు కోసం ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టిచ్చిన తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నామని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్ రూ. 35,000 కోట్లు కట్టాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
వొడాఫోన్ ఐడియాపై పెరుగుతున్న ఒత్తిడి..
భారతీ ఎయిర్టెల్ బకాయిలను చెల్లిస్తుండడంతో వొడాఫోన్ ఐడియాపై తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ రిలీఫ్ ప్యాకేజిని ప్రకటించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ప్యాకేజీ లేకపోతే కంపెనీ మూసెయ్యాల్సి వస్తుందని మొరపెట్టుకుంది. డిజిటల్ కమ్యునికేషన్ కమిషన్(డీసీసీ) శుక్రవారం సమావేశమయినప్పటికి టెలికాం సెక్టార్కు ఎటువంటి రిలీఫ్ ప్యాకేజిని ప్రకటించలేదు. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు ఇంటర్నల్గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది. ఏజీఆర్ బకాయిలను థర్డ్ పార్టీ ద్వారా లెక్కించేందుకు కూడా డీఓటీ సిద్ధమయ్యిందని వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు కోర్ ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూపై మాత్రమే టెలికాం కంపెనీలు ట్యాక్స్ను కట్టేవి. సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్లో ఏజీఆర్ నిర్వచనాన్ని మార్చడంతో , గత 14 ఏళ్లకు గాను నాన్ కోర్ వ్యాపార రెవెన్యూలపై ట్యాక్స్ను, వీటిపై వడ్డీని, ఫైన్లను కట్టాల్సి వచ్చింది. ఈ తీర్పు ప్రభావం వొడాఫోన్ ఐడియాపై ఎక్కువగా పడింది. కంపెనీ రూ. 50,000 కోట్ల బకాయిలను కట్టాలి.