
బాలవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ప్రతిష్టాత్మక కేన్స్ పిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా చీరకట్టుతో ఆమె కనిపించడం విశేషం. తెల్లని చీరలో మెరిసిన ఐశ్వర్య నుదుటన సిందూరంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇటీవల పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కు ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ని చేపట్టిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకగా, బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటేలా ఐశ్వర్య ఇలా సిందూరంతో కనిపించారు. ఆమె లుక్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ప్రముఖ నటి సెలీనా జైట్లీ దీనిపై స్పందిస్తూ.. ఇది కేవలం సంప్రదాయానికే పరిమితం కాదని, భారతదేశపు సామూహిక స్ఫూర్తికి, త్యాగానికి, ప్రతిఘటనకు శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటానికి, జవాబుదారీతనం డిమాండ్ చేయడానికి, శాంతియుతంగా జీవించే మన హక్కును కాపాడుకోవడానికి ఇది ఒక పిలుపు అని సెలీనా వివరించారు.