సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా .. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ

సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా ..  గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ

 

  • సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా ..  గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ 
  • అత్యధిక ఏరియాల్లో గెలిచినా మెజార్టీ ఓట్లు పొందలేకపోయిన ఐఎన్‌‌టీయూసీ
  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..  94.20 శాతం పోలింగ్​


హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ యూనియన్‌‌ విజయం సాధించింది. 11 డివిజన్లలో అత్యధికంగా ఆరు డివిజన్లను కాంగ్రెస్​అనుబంధ ఐఎన్​టీయూసీ, ఐదు డివిజన్లను ఏఐటీయూసీ గెలిచినప్పటికీ... ఓవరాల్​ఓట్ల పరంగా ఐఎన్​టీయూసీపై ఏఐటీయూసీ 2,007 ఓట్ల మెజారిటీ సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి, రామగుండం–1, రామగుండం– 2, మందమర్రి, శ్రీరాంపూర్‌‌ డివిజన్లలో ఏఐటీయూసీ (ది సింగరేణి కోల్​మైన్​వర్కర్స్​యూనియన్) విజయం సాధించింది. 

కాంగ్రెస్‌‌ అనుబంధ ఐఎన్‌‌టీయూసీ (సింగరేణి కోల్​మైన్​లేబర్​యూనియన్)‌ ఇల్లందు, కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్‌‌, మణుగూరు, రామగుండం– 3​, భూపాపల్లి డివిజన్లలో గెలిచింది. కాగా, గత ఎన్నికల్లో ఒక్క డివిజన్‌‌లో కూడా గెలవని ఐఎన్‌‌టీయూసీ యూనియన్‌‌ ఈసారి అత్యధికంగా ఆరు డివిజన్లలో గెలిచి విజయ ఢంకా మోగించడం విశేషం. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్​) ఈసారి ఏ ఒక్క చోటా ప్రభావం చూపలేకపోయింది. ఆ యూనియన్ ​చాలా చోట్ల జీరో, సింగిల్ డిజిట్​ఓట్లకే పరిమితమైంది. ఏఐటీయూసీ గెలుపు ఖాయం కావడంతో చాలాచోట్ల ఆ యూనియన్​ నాయకులు సంబరాల్లో మునిగితేలారు. మరోవైపు మణుగూరులో ఏఐటీయూసీపై ఐఎన్​టీయూసీ కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ రీ కౌంటింగ్​కు ఏఐటీయూసీ నాయకులు డిమాండ్​ చేయగా, ఆఫీసర్లు అంగీకరించలేదు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో ఐఎన్​టీయూసీ గెలుపొందడం విశేషం.

ప్రశాంతంగా ఎన్నికలు.. 

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు 84 సెంటర్లలో ఎన్నికలు జరగ్గా, 94.2% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది ఓటు వేశారు. కొత్తగూడెం కార్పొరేట్‌‌లో 1,191 మందికి గాను  1,146  మంది, కొత్తగూడెం ఏరియాలో 2,326 మందికి గాను 2,207 మంది, ఇల్లందులో 614  మందికి గాను 604  మంది, మణుగూర్‌‌లో 2,450  మందికి గాను  2,378  మంది, రామగుండం1లో 5,384  మందికి గాను 5,064  మంది, రామగుండం 2 ఏరియాలో 3,556 మందికి గాను 3,369 మంది, రామగుండం3లో 3,884 మందికి గాను 3,612  మంది, భూపాలపల్లిలో 5,410 మందికి గాను 5,123  మంది, బెల్లంపల్లిలో 996  మందికి గాను 959 మంది, మందమర్రిలో 4,835 మందికి గాను 4,515  మంది, శ్రీరాంపూర్‌‌లో 9,127 మందికి గాను 8,491 మంది ఓటేశారు.