
- అక్రమ మైనింగ్ను అడ్డుకోవద్దని ఆఫీసర్కు ఫోన్ కాల్
- వాయిస్ గుర్తుపట్టక వీడియో కాల్ చేయాలని కోరిన ఆఫీసర్
ముంబై: మహిళా ఐపీఎస్ ఆఫీసర్ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బెదిరించారు. అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెపై నోరుపారేసుకున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోలాపూర్లోని కర్మాలాలో పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ.. కుర్దు గ్రామంలో అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లారు. ఆ టైమ్లో ఎన్సీపీ కార్యకర్త ఒకరు ఫోన్ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చి, అజిత్ పవార్ లైన్లో ఉన్నారని, ఆయనతో మాట్లాడాలని చెప్పాడు. అయితే, ఫోన్లో పవార్ వాయిస్ను గుర్తుపట్టని అంజనా కృష్ణ.. తన ఫోన్కు వీడియో కాల్ చేయాలని కోరింది. దీంతో అజిత్ పవార్ ఆగ్రహానికి గురయ్యారు. ‘‘నీకెంత ధైర్యం.. నేను ఫోన్ చేస్తే నమ్మవా? నీపై చర్యలు తీసుకుంటాను. నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావా? నీ నెంబర్ ఇవ్వు.. లేదంటే వాట్సాప్లో కాల్ చెయ్. అప్పుడు నన్ను గుర్తుపడ్తవ్” అంటూ అంజనా కృష్ణను అజిత్ పవార్ బెదిరించినట్టుగా వీడియోలో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సొంత పార్టీ దొంగలను కాపాడడం కోసం మహిళా ఐపీఎస్ ఆఫీసర్ను బెదిరించారని మండిపడ్డాయి. ‘‘పవార్.. నీ పార్టీ దొంగలను కాపాడడం కోసం మహిళా ఐపీఎస్ను బెదిరిస్తవా? అక్రమ తవ్వకాలతో ప్రభుత్వానికే నష్టం. అందులోనూ నువ్వే ఆర్థిక మంత్రివి” అని శివసేన (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్ చురకలు అంటించారు. పవార్కు
ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
మహిళా ఆఫీసర్లంటే గౌరవం: అజిత్ పవార్
ఈ వివాదంపై అజిత్ పవార్ స్పందించారు. తాను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివరణ ఇచ్చుకున్నారు. తనకు పోలీస్ ఆఫీసర్లంటే గౌరవం ఉందని, అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘‘చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మాట్లాడాను. పోలీసులు, ముఖ్యంగా మహిళా అధికారులంటే నాకు చాలా గౌరవం ఉంది” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.