- బంగారం కొనడానికి వెనకడుగేస్తున్న కన్జూమర్లు
- ఈసారి అమ్మకాలు 20% పడిపోతాయంటున్న జ్యుయెలర్లు
- రేట్లు తగ్గితే సేల్స్ ఊపందుకుంటాయని వెల్లడి
- డిజిటల్ గోల్డ్ కొనుగోళ్ళు పెరుగుతాయంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేల దగ్గర ఉంది. కిందటేడాది ఇదే టైమ్లో తులం బంగారం రేటు రూ.54 వేలు పలికింది. గత 12 నెలల్లోనే 10 గ్రాముల గోల్డ్ ధర 8 వేలకు పైగా పెరగడంతో సేల్స్ తగ్గుతున్నాయని జ్యుయెలర్లు చెబుతున్నారు. ఈసారి అక్షయ తృతీయకు గోల్డ్ జ్యుయెలరీ అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం రేట్లు ఎక్కువగా ఉండడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిందటేడాది అక్షయ తృతీయతో పోలిస్తే ఈసారి బంగారం, డైమండ్ నగల సేల్స్ ఏకంగా 20 శాతం తగ్గుతాయని అంచనావేస్తున్నారు.
‘10 గ్రాముల గోల్డ్ ధర రూ.60 వేలకు (ఫ్యూచర్స్) పైన ఉండడంతో పసిడి కొనుగోలుపై కన్జూమర్లు వెనకడుగేస్తున్నారు. రేట్లు రికార్డ్ లెవెల్ నుంచి కొంత తగ్గినా, గోల్డ్ బుల్లిష్గా ఉంది. దీని ప్రభావం అక్షయ తృతీయ సేల్స్పై పడుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఈసారి బంగారు నగల అమ్మకాలు 20 శాతం తగ్గుతాయని అంచనావేస్తున్నాం’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ (జీఐసీ) చైర్మన్ శ్యామ్ మెహ్రా పేర్కొన్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ రోజున గోల్డ్ కొంటే మంచిదని భావిస్తారు. ఈ పండుగ నాడు జరిగే జ్యుయెలరీ అమ్మకాల్లో 40 శాతం సౌత్ ఇండియాలోనే జరుగుతాయని శ్యామ్ అన్నారు. 25 శాతం సేల్స్ పశ్చిమ భారతంలో, 20 శాతం అమ్మకాలు తూర్పు భారత దేశంలో జరుగుతాయని వివరించారు.
నార్త్ ఇండియా నుంచి జరిగే సేల్స్ వాటా 15 శాతంగా ఉంటుందని చెప్పారు. ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాన్నే జీఐసీ మాజీ చైర్మన్, ఎన్ఏసీ జ్యుయెలర్స్ ఎండీ అనంత పద్మనాభన్ వెల్లడించారు. ధరలు ఎక్కువగా ఉంటే అక్షయ తృతీయ నాడు సేల్స్ తగ్గిపోతాయని అన్నారు. ‘గోల్డ్ ధరలు సడెన్గా పెరగడంతో ఈసారి అక్షయ తృతీయ సేల్స్ వాల్యూ పరంగా 10 శాతం మేర తగ్గుతాయని అంచనావేస్తున్నాం. వాల్యూమ్ పరంగా అయితే 20 శాతం మేర పడిపోతాయి’ అని వివరించారు. ఒకవేళ రేట్లు సడెన్గా తగ్గితే అమ్మకాలు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.
గోల్డ్ ధరలు మరింత పైకి..
బంగారం ధరలు మరింత పైకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోల్డ్ కదలికలను పెంచే అంశాలేవి ప్రస్తుతం లేవని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వస్తున్నా, ఆయిల్ ధరలు తగ్గుతున్నా గోల్డ్ ధరలు తగ్గడం లేదని కమోట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈఓ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60 వేల పైన కదులుతోందని, మరికొంత కాలం పాటు ఇదే ధరల దగ్గర కదలాడొచ్చని వెల్లడించారు. పెరిగిన ధరలకు అడ్జెస్ట్ అవ్వడానికి దేశంలోని కన్జూమర్లకు కొంత టైమ్ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఈ ఏడాది అక్షయ తృతీయ సేల్స్ తగ్గొచ్చని అన్నారు. ఈ పండుగ నాడు గోల్డ్ కొనుగోలు చేయడాన్ని లక్షల మంది ఇండియన్స్ నుంచి వేరు చేయలేమని , గోల్డ్ కొనడాన్ని మంచిదిగా వీరు భావిస్తారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ (ఇండియా) సీఈఓ సోమసుందరమ్ పీఆర్ అన్నారు.
‘ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు గోల్డ్ ధరలు గరిష్టాల్లో ఉన్నాయి. గత కొన్ని వారాలుగా కన్జూమర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. మరోవైపు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పెరగడాన్ని గమనించొచ్చు’ అని వివరించారు. తాజా ట్యాక్స్ మార్పులతో గోల్డ్ ఫండ్స్ కొంత నష్టపోతాయని, దీంతో డిజిటల్ గోల్డ్ బయ్యింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనావేశారు. గత వారం నుంచి 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60 వేల దగ్గర (ఫ్యూచర్స్) కదులుతోందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ ధరలు ఎంతో కొంత తగ్గుతాయని కన్జూమర్లు ఆశిస్తున్నారని అన్నారు. ‘ గోల్డ్ అవుట్ లుక్ పాజిటివ్గా ఉంది. ఇంకో మూడు నెలల్లో రేట్లు తగ్గింపు ప్రారంభం కాకపోయినా రేట్ల పెరుగుదల మాత్రం ఆగిపోయే అవకాశం ఉంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది’ అని వివరించారు.