మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా చేగుంట రైల్వే ట్రాక్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నందున వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చేగుంట (గాంధీ చౌక్) నుంచి మెదక్ వెళ్లే రోడ్డుకు ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతున్నందున చేగుంట నుంచి మెదక్ వెళ్లే టూ, త్రీ వీలర్ వాహనాలు ఎల్సీ గేటు వద్ద ఉన్న సీసీ రోడ్డు నుంచి పాత నేషనల్ హైవే చేగుంట పట్టణంలోని ప్రస్తుత బస్స్టాప్ ఎదురుగా వెంచర్ మీదుగా వెళ్లాలన్నారు.
కార్లు, బస్సులు, వ్యాన్లు, ఇతర వాహనాలు నార్సింగి నుంచి చిన్నశంకరంపేట డబుల్ రోడ్డు ద్వారా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్రక్కులు, భారీ వాహనాలు రామాయంపేట కానీ, నర్సాపూర్ నుంచి కానీ వెళ్లాలని, మాసాయిపేట నుంచి మెదక్ ప్రయాణించే వాహనాలు చిన్నశంకరంపేట వయా ధర్పల్లి రోడ్డు నుంచి వెళ్లాలని సూచించారు. తూప్రాన్ నుంచి మెదక్ ప్రయాణించే వాహనాలు వెల్దుర్తి, ఉప్పులింగాపూర్-, గవ్వలపల్లి మీదుగా వెళ్లాలని చెప్పారు.
