
నకిలీ విత్తనాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. రైతులను నిండా ముంచుతున్నాయి. నకిలీ విత్తన మాఫియాతో రైతాంగం కుదేలవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటూ, నాణ్యమైన విత్తనాల కోసం ఫెర్టిలైజర్ షాపులు, విత్తన విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, రైతులు నమ్మి కొనుగోలు చేస్తున్న విత్తనాలన్నీ నాణ్యమైనవేనా? అని ప్రశ్న తలెత్తుతోంది. వ్యవసాయంలో విత్తనం పాత్ర అమూల్యమైనది. ఒక రైతు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే, మొదటి మెట్టు నాణ్యమైన విత్తనం ఎంపికే. విత్తన నాణ్యతపైనే పంట దిగుబడి ఆధారపడుతుంది. రైతు ఆదాయం కూడా ఆధారపడుతుంది. కానీ, ఇటీవలి కాలంలో నకిలీ విత్తనాల మాఫియా వ్యవసాయాన్ని మింగేస్తోంది. కొందరు వ్యాపార లాభాల కోసం రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
ఇటీవల సూర్యాపేట, వరంగల్, షాద్ నగర్, ఆత్మకూర్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు జరిపిన సోదాల్లో లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎటువంటి ప్రమాణాలు లేకుండా సరఫరా అవుతున్న ఈ విత్తనాలు నాటిన తర్వాత మొలకే రావడం లేదు. మొలక వచ్చినా సరైన దిగుబడి రావడం లేదు. చివరికి రైతులకు దిగుబడి నష్టం, అప్పుల భారంతోపాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ నకిలీ దందా యధాతథంగా కొనసాగుతూనే ఉంది.
గుర్తింపు పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనాలి
ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన లేదా లైసెన్స్ కలిగిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. అక్రమ వ్యాపారులకు దూరంగా ఉండాలి. ధ్రువీకరించిన కంపెనీల విత్తనాలకే మొగ్గు చూపాలి. ప్యాకెట్పై ‘హోలోగ్రామ్’ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. మొత్తం పెట్టుబడి ఆదా చేస్తుందని తక్కువ ధరలో అమ్మే విత్తనాలతో మోసపోవద్దు. సాధారణంగా నకిలీ విత్తనాలు చాలా తక్కువ ధరకే అమ్ముతారు.
విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తీసుకోవాలి. సమస్య ఏర్పడితే ఇది న్యాయపోరాటానికి ఉపయోగపడుతుంది.
ప్యాకెట్ వెనక ట్యాగ్ లేదా స్టిక్కర్ను చూసి గుర్తించాలి. ప్రైవేట్ కంపెనీల విత్తన సంచుల వెనుక భాగంలో ఉండే ‘పచ్చరంగు ట్యాగ్’ ( ట్రూత్ ఫుల్ లేబుల్డ్ ) లేదా ‘నీలి ట్యాగ్’ (సర్టిఫైడ్ సీడ్) ఆధారంగా విత్తనాన్ని గుర్తించండి. మిరప, పత్తి విత్తనాలపై ముఖ్యంగా పచ్చట్యాగ్ ఉండేలా చూస్తారు. ట్యాగ్పై లైసెన్స్, లాట్ నెంబర్, క్యూ ఆర్ కోడ్ ఉంటేనే నమ్మకం. విత్తన ట్యాగ్పై కంపెనీ లైసెన్స్ నెంబర్, లాట్ నెంబర్, క్యూ ఆర్ కోడ్, ప్యాకింగ్ తేదీ, చెల్లుబాటు గల తేదీలు ముద్రించి ఉండాలి. ఇవి లేనివాటిని కొనొద్దు. మొలక శాతం, జన్యు శాతం వంటి ప్రమాణాలు తప్పక చూడాలి. ప్రతి విత్తన సంచిలో మొలక శాతం 80% కంటే ఎక్కువ, జన్యు శాతం 98% కంటే ఎక్కువ, ఇతర పదార్థాలు 2% కన్నా తక్కువగా ఉండాలి. ప్యాకెట్పై ఇవి ముద్రించి ఉండాలి.
బిటి, నాన్ బిటి పత్తి విత్తనాలను గుర్తించడమెలా?
నాణ్యమైన విత్తనాలు సగటున 80-–90% మొలకెత్తుతాయి. తక్కువ మొలక శాతం నకిలీ విత్తన సంకేతం కావచ్చు. మొలకెత్తిన విత్తనాలు సరైన ఎదుగుదల కనబరచకపోవడం. పూత రాకపోవడం లేదా పూత రాలిపోవడం. చివరికి కాయలుగా మారకపోవడం. ఇలాంటి లక్షణాలు పంట సమయంలో గమనిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి. ఉచిత విత్తన బహుమతుల వంచనలుకు మోసపోకూడదు. మూడు కొనుగోలు చేస్తే ఒకటి ఉచితం వంటి లౌకిక మాయాజాలంకు దూరంగా ఉండాలి. సరిగ్గా తెలుసుకోకుండానే ఎంపిక విత్తనాల విషయంలో సరికాదు. బిటి ప్రత్తి విత్తనాల్లో జన్యుపరమైన మార్పులతో పురుగు నిరోధకత కలిగి ఉండటం వల్ల ఎక్కువ దిగుబడులు వస్తాయి. అయితే, మార్కెట్లో బిటి పేరిట నాన్ బిటి విత్తనాలు కల్తీగా అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బి టి క్రై 1 ఏ బి/ క్రై 1ఏ సి రాపిడ్ డిటెక్షన్ కిట్స్ అనే స్ట్రిప్ కిట్లు రైతులకు అందుబాటులో ఉన్నాయి. రెండు గీతలు వస్తే బిటి విత్తనం, ఒక గీత మాత్రమే వస్తే నాన్ బిటి విత్తనం. ఇలా 30 నిమిషాల్లోనే రైతులు తామే పరీక్షించకోగలుగుతారు. విత్తనం నాణ్యత తెలుసుకోవాలంటే మొలకశాతం పరీక్ష తప్పనిసరి.
నకిలీ విత్తనాలను ముందే గుర్తిస్తే మంచిది
నకిలీ విత్తనం అనగా నాణ్యమైన రకంకాని విత్తనం. ధ్రువీకరణ పొందని విత్తనం. ఇవి సాధారణంగా ప్రభుత్వం గుర్తించిన విత్తన ధ్రువీకరణ సంస్థల ధ్రువీకరణ లేకుండా ఉత్పత్తి చేస్తారు. నకిలీ విత్తనాలను రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి పంట వేయకముందు, రెండోది పంట వేసిన తర్వాత. ఒకవేళ పంట వేయకముందు రైతు నకిలీ విత్తనాలను గుర్తించే అవగాహన కలిగి ఉన్నట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. అదేవిధంగా పంట వేసిన తర్వాత గుర్తిస్తే ఆర్థికంగా అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి, రైతులు విత్తనం వేసేముందే ఈ విత్తనాలు నకిలీవా లేదా నిజమైన విత్తనాలా అని తేడాలు గుర్తించి పరీక్షించుకొని విత్తనం నాటుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తిలో విత్తనాల పాత్ర ఎంతో కీలకం. కానీ, మార్కెట్లో నకిలీ విత్తన అమ్మకాలు రైతుల నమ్మకాన్ని నాశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తన భూమిలో విత్తనం వేయకముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించడం అవసరం.
జి. అజయ్ కుమార్, వ్యవసాయ నిపుణుడు