Jack Ma : పాక్‌లో చైనా అపర కుబేరుడు జాక్‌మా ప్రత్యక్షం

Jack Ma : పాక్‌లో చైనా అపర కుబేరుడు జాక్‌మా ప్రత్యక్షం

చైనా అపర కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా పాకిస్తాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ఇంగ్లీష్‌ మీడియా సంస్థ ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది. చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్‌ మా పలు దేశాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాకిస్తాన్‌ లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఆయన పర్యటన వివరాలు గోప్యంగా ఉండటంతో చాలా అనుమానాలు, చాలా ఊహాగానాలు వస్తున్నాయి.

బోర్డ్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మాజీ ఛైర్మన్ మహమ్మద్‌ అజ్ఫర్ అహ్సాన్‌ ఈ పర్యటనను ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. జూన్‌29వ తేదీన జాక్‌మా లాహోర్‌ వచ్చారని, 23 గంటల పాటు అక్కడ ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ అధికారులు, మీడియాతో ఎటువంటి సంభాషణ జరపలేదు. ఒక ప్రైవేటు ప్రాంతంలో బస చేసిన ఆయన.. జూన్‌ 30న తిరిగి వెళ్లిపోయారు. ఆ పర్యటన వేళ.. జాక్‌ మా వెంట ఏడుగురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం. ఆయన నేపాల్ నుంచి పాకిస్తాన్‌ చేరుకున్నారని సమాచారం.

పాక్ లో జాక్ మా పర్యటనతో పలు ఊహానాగాలు మొదలయ్యాయి. వారు పాక్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించినట్లు తెలుస్తోంది. అలాగే ట్రేడ్‌ సెంటర్‌లో సందర్శన, ప్రముఖ వ్యాపారవేత్తలో సమావేశాలు నిర్వహించారు. అయితే ఏమైనా ఒప్పందాలు జరిగాయా..? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. జాక్ మా రాక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ..  రానున్న రోజుల్లో పాకిస్తాన్‌కు ఇది సానుకూల ఫలితాలను ఇస్తుందని అహ్సాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, దీని గురించి చైనా దౌత్యకార్యాలయానికి కూడా సమాచారం లేనట్లు తెలుస్తోంది.

జాక్‌మా, అతని బృందం సభ్యులు పాకిస్తాన్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు పర్యటించినట్లు అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా బిజినెస్‌ చేసేందుకు అనువైన ప్రాంతాల గురించి ఆరాతీయడంతో పాటు, ఆ దేశంలో వ్యాపార వేత్తలతో భేటీ, వివిధ వాణిజ్య ఛాంబర్‌ల అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు,సమావేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. 

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాత చైనా ప్రభుత్వం యాంట్‌ గ్రూప్‌పై చర్యలు చేపట్టింది. కొన్ని నెలలపాటు జాక్ మా ఎవరికీ కనిపించలేదు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. జపాన్‌, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి. దాదాపు ఏడాదిన్న తర్వాత మార్చిలో జాక్‌మా గత నెలలో చైనాకు తిరిగి వచ్చారు.