- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
హైదరాబాద్, వెలుగు : దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో దళితులు, ముస్లింలు లేరన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా మందకృష్ణ ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్తోనే వర్గీకరణ సాధ్యమన్నారు.