- రాజకీయ పార్టీల ప్రతినిధులకు
- కలెక్టర్ రాహుల్రాజ్ సూచన
మెదక్, వెలుగు: పొరపాట్లు లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో మున్సిపల్ తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పొలిటికల్ పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితాలో బోగస్ ఓటర్లు ఉండరాదని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదని సూచించారు.
ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పొలిటికల్ పార్టీ ప్రతినిధులు ఓటర్ జాబితాలో అభ్యంతరాలను లేవనెత్తిన అభ్యంతరాలను, సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, డీపీఓ యాదయ్య, డీఎస్ఓ రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు 345 బ్లాంకెట్స్ అందజేత
హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ చేపట్టిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. చేగుంట మండలం చిన్న శివనూర్లోని శ్రీ వేంకటేశ్వర కాయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ భవర్ కుమార్ మలానీ మంగళవారం కలెక్టరేట్ ను కలిసి 200 బ్లాంకెట్స్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి చేయూత అందించినందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశ్ రావు, ఫ్యాక్టరీ జీఎం లక్ష్మీనారాయణ, మేనేజర్ జంగయ్య పాల్గొన్నారు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎస్జీటీయూ ఆధ్వర్యంలో
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ద్వారా డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో మెదక్, తూప్రాన్ ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్లు మనోజ్ కుమార్, అంబర్ సింగ్ కలెక్టర్ను కలిసి15 బ్లాంకెట్స్ అందించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్ జీ టీయూ) మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 130 బ్లాంకెట్స్ అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, వివిధ మండలాల బాధ్యులు ఉపేందర్, గాంధీ, సురేశ్, పరశురామ్, వెంకటేశ్, రాములు పాల్గొన్నారు.
