- మూడు పార్టీలకు చాలెంజ్గా మారిన ఉప ఎన్నిక
- సెగ్మెంట్కు తరలుతున్న గులాబీ బలగం
- ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్న ఉత్తమ్
- బలమైన అభ్యర్థిని దింపేందుకు కమలం రెడీ
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనరల్ ఎలక్షన్ తరహాలోనే మూడు ప్రధాన పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతుండటం ఉత్కంఠకు దారితీసింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటంతో రాష్ట్రంలో డీలా పడ్డ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈ ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలో దింపడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఈ టైమ్లో జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నిక కావటంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక బిగ్ ఫైట్నే తలపిస్తోంది.
ుజూర్నగర్ సెగ్మెంట్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్కసారీ గెలువలేదు. అందుకే ఈ ఉప ఎన్నికను ఆ పార్టీ సవాల్గా భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితం టీఆర్ఎస్ను వెంటాడుతోంది. ఆ పరిస్థితి రిపీట్ కాకుండా ఉండేందుకు గులాబీ లీడర్లు ఈ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజునే టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించి.. భారీ ఎత్తున ప్రచారానికి ప్లాన్ చేసుకుంది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డినే ఈసారి కూడా పోటీకి దింపింది. 2009 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇక్కడ అలుపెరగని పోరాటమే చేసింది. తొలిసారిగా 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రస్తుత మంత్రి జగదీశ్రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో కాసోజు శంకరమ్మ, 2018 ఎ న్నికల్లో శానంపూడి సైదిరెడ్డి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. వరుసగా మూడు ఓటములకు తోడు.. నల్గొండ ఎంపీ సీటును టీఆర్ఎస్ కోల్పోయింది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్నగర్ సీటును కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఎన్నికల బాధ్యతలు జిల్లా నాయకుల మీద వదిలేయకుండా హైకమాండ్ నేరుగా తెలంగాణ భవన్నుంచి మానిటర్ చేస్తోంది.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వరుస ఓటముల దెబ్బతో ఈసారి మంత్రి జగదీశ్రెడ్డిని ఇక్కడి ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించి.. పల్లా రాజేశ్వర్రెడ్డిని ఇన్చార్జిగా టీఆర్ఎస్ నియమించింది. ఏకంగా పొరుగు జిల్లాల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు, ఇతర నాయకులకు హుజూర్నగర్లో మోహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, నిధులన్నీ అటువైపు ధారపోసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
పీసీసీ చీఫ్ ఉత్తమ్కు చాలెంజ్
హుజూర్నగర్ ముందునుంచీ కాంగ్రెస్కు కంచుకోట. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిరుడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్.. ఆరు నెలల వ్యవధిలో లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచి నల్గొండ ఎంపీ అయ్యారు. ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ సీటును మళ్లీ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఉత్తమ్ సొంత నియోజ కవర్గం కావడం, స్వయంగా తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని పోటీకి దింపడంతో ఉప ఎన్నిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట పెరగడంతోపాటు, నియోజకవర్గంలో తన ఇమేజ్కు మరోసారి తిరుగుండదని ఉత్తమ్ భావిస్తున్నారు. అందుకే వివిధ పార్టీల మద్దతును ఆయన కూడగడుతున్నారు. టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి నేతలతోపాటు, వివిధ సంఘాల మద్దతును కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ ఫిరాయించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ టైమ్లో వచ్చిన ఉప ఎన్నిక కావటంతో పార్టీ ముఖ్యులందరూ ఈ సీటును హాట్ సీటుగా భావిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి, భువన గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. త్వరలోనే పార్టీ తరఫున ఎన్నికల ఇన్చార్జ్లను నియమించనున్నారు.