టీ హబ్ ఏడో వార్షికోత్సవంలో కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అన్ని స్టార్టప్లకు హైదరాబాద్ వేదిక కావాలని, ఐటీలో సిలికాన్ వ్యాలీ స్థాయికి మనం ఎదగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం టీ - హబ్ ఏడో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టీ హబ్ ఎదుగుదల పిల్లవాడి ఎదుగుదలను చూస్తున్నట్టుగా ఉందని, ఈ సక్సెస్తో తాను గర్వ పడుతున్నానని అన్నారు. 5.82 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న టీ హబ్లో 2 వేలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని, ప్రపంచంలో అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా ఇది మారిందన్నారు.
మెంటార్షిప్, మనీ, మార్కెట్ యాక్సెస్, మోటివేషన్, మైండ్సైట్, మ్యాన్పవర్, పార్ట్నర్షిప్లు, పాలసీ అడ్వైజరీపై టీ హబ్ దృష్టి సారించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు జీఎస్డీపీ రూ.5.06 లక్షల కోట్లు ఉంటే, తమ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకో నాలుగు శాతం వృద్ధి సాధిస్తే రానున్న ఐదేళ్లలో జీఎస్డీపీ రూ.30 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఇందుకు ఇంక్రిమెంటల్ ఇన్నొవేషన్ దోహదపడుతుందన్నారు. ఈ దిశగా స్టార్టప్లు ప్రయత్నించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.