హైదరాబాద్ వెలుగు: ‘‘తెలంగాణల పెండింగ్ ప్రాజెక్టులన్న ముచ్చట్నే ఉండది. అన్ని ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్త.. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జల్దీ పూర్తి చేసి నీళ్లిస్తం. తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం..’ అని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పిన మాట ఇది. కానీ రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోయాయి. 70, 80 శాతం దాకా పూర్తయినవి, కొన్ని నిధులిస్తే కొద్దిరోజుల్లోనే సాగుకు నీళ్లివ్వగలిగిన స్కీమ్లు కూడా ఎట్లా ఉన్నవి అట్లానే ఉండిపోతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ఫాం హౌస్ దగ్గర ఉన్న ఎర్రవెల్లి వరకు నీళ్లను ఎత్తిపోస్తూ.. మరో రూ.21 వేల కోట్లతో అదే కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ పనులను చేపట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చే పాలమూరు –రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీంలు నత్తనడకన సాగుతున్నాయి.
రీ ఇంజనీరింగ్.. రీ డిజైన్
ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్పేరుతో కాళేశ్వరంగా మార్చిన సర్కారు.. నీళ్లు తీసుకునే పాయింట్ను తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది. దీంతో నష్టపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్కు నీళ్లిచ్చేందుకు.. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టి రెండు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పింది. కానీ అక్కడ ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. అయినా చిత్రంగా ప్రాణహిత ఆయకట్టుకు నీళ్లిచ్చామంటూ సర్కారు ఈ ఏడాది బడ్జెట్పద్దుల్లో చెప్పుకొంది. ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టెండర్లు పిలిచిన పాలమూరు –రంగారెడ్డిని మాత్రం పూర్తిగా విస్మరించారు. రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును ఒక్క టీఎంసీకి కుదించారు. దీనివల్ల ప్రతిపాదిత 12 లక్షల ఎకరాల్లో సగం మేర కూడా నీళ్లివ్వడం కష్టమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇక డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటుందా అన్నదే సందేహంగా మారింది.
కృష్ణా ప్రాజెక్టుల దుస్థితి
శ్రీశైలం నుంచి రోజుకో టీఎంసీ నీటిని తీసుకునే ఎస్ ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును ఏడాదిలోగా కంప్లీట్ చేస్తామని కేసీఆర్ ప్రకటించి ఐదారేండ్లు గడుస్తోంది. ఇప్పటికీ ఇంచు కూడా ముందుకు కదల్లేదు. ఏడు కిలోమీటర్ల పనులు పెండింగ్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్రతిపాదించిన ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకం ఊసే లేదు.
కల్వకుర్తి రిజర్వాయర్లు ఏవి?
కల్వకుర్తి లిఫ్ట్ స్కీం కింద నీటిని నిల్వ చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మిస్తామన్న కేసీఆర్ హామీ అమలుకు నోచుకోలేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 2016–17 వాటర్ ఇయర్లో 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగా 2018–19లో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని సర్కారు అంటోంది. కానీ వీటిలో కోయిల్సాగర్ తప్ప మిగతా ప్రాజెక్టులేవి పూర్తి కాలేదని ఇరిగేషన్ వర్గాలే చెప్తున్నాయి. ఇక ఎల్లంపల్లిపై ఏర్పాటు చేసిన గూడెం లిఫ్ట్ స్కీం మూలనపడింది. పాలెంవాగు, కొమ్రంభీం, నీల్వాయి, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చనాకా – కొరాట, సదర్మాట్ బ్యారేజీ పనులు ఆగిపోయాయి. మిడ్ మానేరు రిజర్వాయర్ ను పూర్తి చేసినా డిస్ట్రిబ్యూటరీ సిస్టం పనులు చేపట్టాల్సి ఉంది.
అన్నింటికీ కాళేశ్వరమే దిక్కు
సర్కారు రాష్ట్రంలో అన్నింటికీ కాళేశ్వరం లింకు పెడుతోంది. నల్గొండ జిల్లాకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్తోంది. బస్వాపూర్ నుంచి గ్రావిటీ ద్వారా డిండి లిఫ్ట్స్కీం మొదటి రిజర్వాయర్ శివన్నగూడెంకు నీళ్లు తరలిస్తామని అంటోంది. కానీ మల్లన్నసాగర్ దిగువన గంధమల్ల రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. భూసేకరణ కోసం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. బస్వాపూర్రిజర్వాయర్ పనులు పదిశాతంలోపే పూర్తయ్యాయి. అవి రెండు పూర్తయితేగానీ శివన్నగూడెం లింక్మొదలుపెట్టడం సాధ్యంకాదని ఇంజనీర్లు చెప్తున్నారు.
- దేవాదుల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని సీఎం కొన్ని నెలల క్రితం ఆదేశించారు. మల్లన్నసాగర్ నుంచి జనగామ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లాలకు నీళ్లిచ్చేలా పనులకు ప్రపోజల్ రెడీ చేస్తున్నారు.
- పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని చివరి రిజర్వాయర్ కేపీ లక్ష్మీదేవునిపల్లికి కాళేశ్వరం నీటినే తరలిస్తామని సర్కారు చెప్తోంది. ఇందుకోసం స్టడీ చేసి సీఎం కేసీఆర్కు రిపోర్ట్ ఇచ్చారని, త్వరలోనే డిటైల్డ్ సర్వే చేస్తామని ఇంజనీర్లు అంటున్నారు.
- పాలమూరు–రంగారెడ్డి, డిండి, దేవాదుల లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆయకట్టును స్టెబిలైజ్ చేసేందుకే కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులు చేస్తున్నామని అంటున్నారు. రూ.21 వేల కోట్లతో చేపట్టే ఈ పనుల టెండర్ల పని పూర్తయిందని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్తున్నారు.