
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
ఖైరతాబాద్, వెలుగు: యూట్యూబ్ చానళ్లకు పత్రికా స్వేచ్ఛ ఉండదని, భావ స్వేచ్ఛ మాత్రమే ఉంటుందని, దానికి కూడా పరిమితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరికాదని సూచించారు. రాజకీయ పార్టీలు నడుపుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మాత్రమే ఇలా చేస్తున్నాయని, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. యూట్యూబ్ చానళ్లను నడుపుతున్న సీనియర్ జర్నలిస్టులను తప్పుబట్టడం లేదని పేర్కొన్నారు. కాగా, మెయిన్ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్, ఇతర ప్రింట్ మీడియా పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. చిన్న పత్రికలకు రాష్ట్ర సర్కార్ యాడ్స్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఎంపానెల్డ్స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజిగిరి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న పత్రికలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ఏడాదికి రూ.10 కోట్లు యాడ్ల కోసం కేటాయించిందని తెలిపారు. 309 డైలీ, 250 మ్యాగజైన్స్కు ఏ, బీ, సీ, డీ కేటగిరీలో యాడ్స్ వస్తాయన్నారు.