- అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ
గోదావరిఖని, వెలుగు: ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అడిషనల్ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణ శ్రీ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం బల్దియా ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 జనవరి 10 నాటికి ఓటరుగా నమోదై, ఎపిక్ ఐడీలో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ల జాబితాలో చేర్చినట్లు చెప్పారు. ముసాయిదా జాబితాపై ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10న తుది జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.
మరణించిన, రెండు చోట్ల నమోదైనవి.. శాశ్వతంగా వలసపోయిన ఓటర్ల వివరాలు లిఖిత పూర్వకంగా అందజేస్తే సవరణ కోసం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతీ అభ్యంతరాన్ని పరిశీలిస్తాం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్,వెలుగు: ఇటీవల ప్రకటించిన ఓటర్ ముసాయిదా జాబితాపై స్వీకరిస్తున్న ప్రతీ అభ్యంతరాన్ని పరిశీలించి, జాబితాను ప్రకటిస్తామని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్లోని తన చాంబర్లో వివిధ పార్టీల లీడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ల పునర్విభజన, డివిజన్ల వారీగా ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా మ్యాపింగ్, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్డ్ వివరాలను ప్రతినిధులకు వివరించారు.
అనంతరం 66 డివిజన్లకు సంబంధించి ఇటీవల ప్రచురించిన ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితాపై వివిధ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలను పరిశీలించి, ఫైనల్ ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా తయారు చేస్తామని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల లీడర్లు యాదగిరి సునీల్రావు, డి.శంకర్, అంజన్ కుమార్, హరిశంకర్, సయ్యద్ గులామ్ హైమద్ హుస్సేన్, అబ్బాస్ షమీ, మణికంఠరెడ్డి, రాజు, వాసుదేవరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
ముసాయిదా ఓటర్ లిస్ట్పై మీటింగ్
సుల్తానాబాద్/రాయికల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీస్లో ముసాయిదా ఓటర్ లిస్ట్ పై సోమవారం అధికారులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. లిస్ట్పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవరిస్తామని కమిషనర్ టి.రమేశ్ తెలిపారు. రాయికల్ మున్సిపాలిటీలో కమిషనర్ మనోహర్గౌడ్వివిధ రాజకీయ పార్టీల శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఓటర్జాబితాలో ఎమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని లీడర్లను కోరారు. ఆయా మీటింగుల్లో వివిధ పార్టీల లీడర్లు పాల్గొన్నారు.
