సొంత కంపెనీలలోనే సీక్రెట్​ పెట్టుబడులు

సొంత కంపెనీలలోనే సీక్రెట్​ పెట్టుబడులు
  • అదానీపై జార్జ్‌ సోరస్‌కి చెందిన సంస్థ ఆరోపణలు
  • అవన్నీ అబద్ధాలేనని అదానీ గ్రూప్​ ప్రకటన

బిజినెస్​ డెస్క్, వెలుగు : ప్రమోటర్ల కుటుంబ సభ్యులు ఆపరేట్​ చేసే రెండు మారిషస్​ ఫండ్స్ (కంపెనీలు)​ అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లలోనే  సీక్రెట్ పెట్టుబడులు పెట్టాయని తాజా ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఆరోపణలలో నిజం లేదని అదానీ గ్రూప్​ తిప్పి కొట్టింది. తాజా ఆరోపణల నేపథ్యంలో  గురువారం సెషన్లో అదానీ గ్రూప్​ షేర్లన్నీ నష్టాలపాలయ్యాయి. 2013–2018 మధ్య కాలంలో అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయని, సరిగ్గా అదే కాలంలో మారిషస్​లోని ప్రమోటర్ల  కంపెనీలు (ఫండ్స్​) ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని తాజాగా జార్ట్ సోరస్‌కు చెందిన  ఆర్గనైజ్డ్​ క్రైమ్​ అండ్​ కరప్షన్​ రిపోర్టింగ్​ ప్రాజెక్ట్​ (ఓసీసీఆర్​పీ) వెల్లడించింది. 

రెండు  మారిషస్​ ఫండ్స్​ పెట్టుబడులు– అదానీ గ్రూప్​ కంపెనీల మధ్య లింకును పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓసీసీఆర్​పీ తెలిపింది. 2013–2018 మధ్య కాలంలో ఇండియాలోనే శక్తివంతమైన బిజినెస్​ గ్రూప్​లలో ఒకటిగా అదానీ మారిందని, ఆ గ్రూప్​లోని కంపెనీల షేర్లన్నీ ఆ టైములో భారీగా పెరిగాయని పేర్కొంది. మారిషస్​ కంపెనీలు రెండింటికీ అదానీ గ్రూప్  ​ప్రమోటర్ల కుటుంబ సభ్యులు వినోద్​ అదానీ, గౌతమ్​ అదానీలకు చాలా సన్నిహితులైన వ్యక్తులే బెనిఫిషియరీలుగా తేలుతోందని ప్రకటించింది. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్లిందనే అంశాన్ని విశ్లేషించడానికి అనేక డాక్యుమెంట్లను పరిశీలించినట్లు ఓసీసీఆర్​పీ తెలిపింది. అదానీ గ్రూప్​లోని కంపెనీలు ఓవర్​ ఇన్వాయిసింగ్​ ద్వారా బిలియన్​ డాలర్లను మారిషస్​ ఫండ్స్​కు రూట్​ చేసినట్లు ఓసీసీఆర్​పీ వెల్లడించింది.

డొల్ల కంపెనీలు వినోద్​ అదానీ మనుషులవే....

యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​కి చెందిన నజీర్​ అలీ షబాన్​ అహ్లి, తైవాన్​కు చెందిన చాంగ్​ చుంగ్​లింగ్​లు మిలియన్​ల కొద్దీ డాలర్లు వెచ్చించి అదానీ గ్రూప్​ షేర్లలో ట్రేడింగ్​ జరిపారని ఓసీసీఆర్​పీ రిపోర్టు పేర్కొంది. మారిషస్ ​ ఫండ్స్​ ద్వారానే ఈ ట్రేడింగ్​ కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించింది. వినోద్​ అదానీ వద్ద పనిచేసే ఒక ఎంప్లాయీ దుబాయ్ ​నుంచి మారిషస్​ ఫండ్స్​ కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు తెలిపింది. 

షేర్ల ధరలు పెంచేందుకు అదానీ గ్రూప్​ చేసిన ఈ నిర్వాకానికి  సంబంధించిన ఆధారాలను 2014 లోనే సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్చేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా (సెబీ)కి అందచేసినట్లు కూడా ఓసీసీఆర్​పీ పేర్కొంది. ఇందుకు ఆధారంగా ఒక లెటర్​ను ఓసీసీఆర్​పీ ప్రస్తావించింది. 2014 లో సెబీ ఛైర్మన్​గా ఉన్న యూ కే సిన్హా ఇప్పుడు అదానీ గ్రూప్​ మీడియా కంపెనీ ఎన్​డీటీవీలో డైరెక్టర్​గా ఉన్నారు.

హిండెన్​బర్గ్​ ఎపిసోడ్​....

ఈ ఏడాది మొదట్లో అమెరికా షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ అదానీ గ్రూప్​  కంపెనీల షేర్ల ధరలలో మానిప్యులేషన్​, అకౌంటింగ్​ మోసాలు జరుగుతున్నాయంటూ ఒక రిపోర్టును బయటకు తెచ్చింది. అప్పుడే వినోద్ అదానీ సంబంధం గురించీ ప్రస్తావించింది. హిండెన్​బర్గ్​ రిపోర్టుతో  అదానీ గ్రూప్​లోని 10 కంపెనీల​ షేర్లూ  పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో ప్రపంచంలోని మూడవ సంపన్నుడిగా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అప్పటిదాకా వెలుగొందిన గౌతమ్​ అదానీ సంపద అకస్మాత్తుగా ఆవిరైపోయింది. ఏకంగా 150 బిలియన్​ డాలర్ల సంపదను అదానీ గ్రూప్‌  పోగొట్టుకుంది. 

అదానీ గ్రూప్​ ఖండన...

హిండెన్​బర్గ్​ తర్వాత ఇప్పుడు జార్జ్​సొరోస్​ నాయకత్వంలోని కొంత మంది వ్యక్తులు, కొన్ని ఫారిన్​ మీడియా సంస్థలు కలిసి తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయని అదానీ గ్రూప్​ గురువారం ఖండించింది. ఓవర్​ ఇన్వాయిసింగ్​ ఆరోపణలనూ తిప్పి కొట్టింది. ఈ అంశంలో గతంలోనే డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) దర్యాప్తు నిర్వహించి, కేసును క్లోజ్​ చేసిందని అదానీ గ్రూప్​ తెలిపింది.