
- అదానీపై జార్జ్ సోరస్కి చెందిన సంస్థ ఆరోపణలు
- అవన్నీ అబద్ధాలేనని అదానీ గ్రూప్ ప్రకటన
బిజినెస్ డెస్క్, వెలుగు : ప్రమోటర్ల కుటుంబ సభ్యులు ఆపరేట్ చేసే రెండు మారిషస్ ఫండ్స్ (కంపెనీలు) అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలోనే సీక్రెట్ పెట్టుబడులు పెట్టాయని తాజా ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఆరోపణలలో నిజం లేదని అదానీ గ్రూప్ తిప్పి కొట్టింది. తాజా ఆరోపణల నేపథ్యంలో గురువారం సెషన్లో అదానీ గ్రూప్ షేర్లన్నీ నష్టాలపాలయ్యాయి. 2013–2018 మధ్య కాలంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయని, సరిగ్గా అదే కాలంలో మారిషస్లోని ప్రమోటర్ల కంపెనీలు (ఫండ్స్) ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని తాజాగా జార్ట్ సోరస్కు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) వెల్లడించింది.
రెండు మారిషస్ ఫండ్స్ పెట్టుబడులు– అదానీ గ్రూప్ కంపెనీల మధ్య లింకును పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓసీసీఆర్పీ తెలిపింది. 2013–2018 మధ్య కాలంలో ఇండియాలోనే శక్తివంతమైన బిజినెస్ గ్రూప్లలో ఒకటిగా అదానీ మారిందని, ఆ గ్రూప్లోని కంపెనీల షేర్లన్నీ ఆ టైములో భారీగా పెరిగాయని పేర్కొంది. మారిషస్ కంపెనీలు రెండింటికీ అదానీ గ్రూప్ ప్రమోటర్ల కుటుంబ సభ్యులు వినోద్ అదానీ, గౌతమ్ అదానీలకు చాలా సన్నిహితులైన వ్యక్తులే బెనిఫిషియరీలుగా తేలుతోందని ప్రకటించింది. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్లిందనే అంశాన్ని విశ్లేషించడానికి అనేక డాక్యుమెంట్లను పరిశీలించినట్లు ఓసీసీఆర్పీ తెలిపింది. అదానీ గ్రూప్లోని కంపెనీలు ఓవర్ ఇన్వాయిసింగ్ ద్వారా బిలియన్ డాలర్లను మారిషస్ ఫండ్స్కు రూట్ చేసినట్లు ఓసీసీఆర్పీ వెల్లడించింది.
డొల్ల కంపెనీలు వినోద్ అదానీ మనుషులవే....
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన నజీర్ అలీ షబాన్ అహ్లి, తైవాన్కు చెందిన చాంగ్ చుంగ్లింగ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి అదానీ గ్రూప్ షేర్లలో ట్రేడింగ్ జరిపారని ఓసీసీఆర్పీ రిపోర్టు పేర్కొంది. మారిషస్ ఫండ్స్ ద్వారానే ఈ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించింది. వినోద్ అదానీ వద్ద పనిచేసే ఒక ఎంప్లాయీ దుబాయ్ నుంచి మారిషస్ ఫండ్స్ కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు తెలిపింది.
షేర్ల ధరలు పెంచేందుకు అదానీ గ్రూప్ చేసిన ఈ నిర్వాకానికి సంబంధించిన ఆధారాలను 2014 లోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి అందచేసినట్లు కూడా ఓసీసీఆర్పీ పేర్కొంది. ఇందుకు ఆధారంగా ఒక లెటర్ను ఓసీసీఆర్పీ ప్రస్తావించింది. 2014 లో సెబీ ఛైర్మన్గా ఉన్న యూ కే సిన్హా ఇప్పుడు అదానీ గ్రూప్ మీడియా కంపెనీ ఎన్డీటీవీలో డైరెక్టర్గా ఉన్నారు.
హిండెన్బర్గ్ ఎపిసోడ్....
ఈ ఏడాది మొదట్లో అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలలో మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు జరుగుతున్నాయంటూ ఒక రిపోర్టును బయటకు తెచ్చింది. అప్పుడే వినోద్ అదానీ సంబంధం గురించీ ప్రస్తావించింది. హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్లోని 10 కంపెనీల షేర్లూ పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో ప్రపంచంలోని మూడవ సంపన్నుడిగా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అప్పటిదాకా వెలుగొందిన గౌతమ్ అదానీ సంపద అకస్మాత్తుగా ఆవిరైపోయింది. ఏకంగా 150 బిలియన్ డాలర్ల సంపదను అదానీ గ్రూప్ పోగొట్టుకుంది.
అదానీ గ్రూప్ ఖండన...
హిండెన్బర్గ్ తర్వాత ఇప్పుడు జార్జ్సొరోస్ నాయకత్వంలోని కొంత మంది వ్యక్తులు, కొన్ని ఫారిన్ మీడియా సంస్థలు కలిసి తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయని అదానీ గ్రూప్ గురువారం ఖండించింది. ఓవర్ ఇన్వాయిసింగ్ ఆరోపణలనూ తిప్పి కొట్టింది. ఈ అంశంలో గతంలోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు నిర్వహించి, కేసును క్లోజ్ చేసిందని అదానీ గ్రూప్ తెలిపింది.