
కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జులై 25న విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాని నేను రిలీజ్ చేసేలా అనుగ్రహించిన నరసింహ స్వామివారికి నమస్కారం.
సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మార్నింగ్ షో రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకుని ఈవెనింగ్కు కొన్ని షోస్ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. భారతదేశం అంతటా ప్రేక్షకులు ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు’ అని అన్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ‘ఇది సినిమా కాదు ఒక మహాదర్శనమని ప్రేక్షకులే చెబుతున్నారు. ఈ సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది. మనందరిలో ఒక డివైన్ ఫీలింగ్ కలిగించిన సినిమా ఇది’ అని చెప్పాడు. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు నిర్మాత శిల్పా ధావన్. కార్యక్రమంలో పాల్గొన్న రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. ఇదొక డివైన్ వండర్ అని అన్నారు. ఈ సినిమా చూడటం పూర్వజన్మల పుణ్యం అని తనికెళ్ల భరణి అన్నారు.