
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ స్థాయిలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్ చేరుకున్నాడు. అల్లు అర్జున్ను కలిసి ప్రీ ప్రొడక్షన్కు సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆమధ్య లాస్ ఏంజెల్స్లోని వీఎఫ్ఎక్స్ స్టూడియోస్కు వెళ్లి హాలీవుడ్ టెక్నీషియన్స్తో చర్చించారు.
జూన్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో జరగబోయే నాట్స్ వేడుకలకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరబోతున్నాడు. జులై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో ఈ వేడుకలు జరగనున్నాయి.