- తనవంతుగా ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయింపు
- నేటికీ భూసేకరణపూర్తిచేయని రాష్ట్ర సర్కారు
- గతేడాదే అడ్మిషన్లకునోటిఫికేషన్ వస్తుం దనుకున్నా రాలే
- ఈసారీ రావడం అనుమానమే అయోమయంలో గిరిపుత్రులు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరుచేసినా టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అడుగు ముందుకుపడడం లేదు. ములుగులో రాష్ట్రప్రభుత్వం చూపిన స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ టీమ్ 2017లోనే ఒకే చేసింది. తనవంతుగా కేంద్రం ఇప్పటికే రూ.10కోట్లు కూడా కేటాయించింది. కానీ యూనివర్సిటీకి కావాల్సిన భూమిని సేకరించి ఇవ్వడంలో మన ఆఫీసర్లు విఫలమయ్యారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం విషయం తేల్చలేదు. కనీసం అటవీశాఖ ల్యాండ్ క్లియరెన్స్కూడా తెప్పించలేకపోయారు. ఫలితంగా యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు.
2017లోనే సెంట్రల్గవర్నమెంట్గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్యూనివర్సిటీ ఏర్పాటు కోసం 2017లోనే సెంట్రల్గవర్నమెంట్ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులతోపాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ నేతృత్వంలోని టీమ్ సభ్యులు2017లోనే ములుగులో పర్యటించారు. గట్టమ్మ దేవాలయ సమీపంలో స్థల పరిశీలన చేశారు. 2018 డిసెంబర్ 31న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం ఈ స్థలంపై సంతృప్తి చెందారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ములుగుకు 200 కిలోమీటర్ల దూరంతోపాటు అద్భుతమైన పర్యాటక కేంద్రాలకు నెలవైన ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. తరగతుల నిర్వహణకు అవసరమైన తాత్కాలిక భవనాలను కూడా పరిశీలించి ఒకే చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తనవంతుగా మొదటివిడత రూ.10 కోట్లు కేటాయించింది.
రైతులకు అందని పరిహారం
ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 498.04 ఎకరాల ప్రభుత్వ భూమిని గట్టమ్మ దేవాలయం వద్ద కేటాయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన 169.35 ఎకరాల భూమిని గిరిజన శాఖకు అప్పగించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న 213 ఎకరాల భూమిని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపారు. కానీ ఇప్పటికీ పర్మిషన్ మాత్రం రాలేదు. మిగిలిన 115 ఎకరాల భూమి రైతుల చేతుల్లో ఉండగా భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదు. రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసింది. మే, జూన్మాసాలలో సర్వే నిర్వహించిన ఆఫీసర్లు భూములు కోల్పోతున్న రైతుల వివరాలు తెలుసుకున్నారు. పరిహారం అందించేందుకు రైతుల జాబితాను సిద్ధం చేశారు. ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.12లక్షల వరకు డిసైడ్ చేశారు. కానీ రైతులు ఇందుకు ఒప్పుకోవడం లేదు. తమకు భూమికి బదులు భూమైనా లేదంటే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో భూ సేకరణ నిలిచిపోయింది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో గిరిజన యూనివర్సిటీ అక్కడే ఆగిపోయింది.
ఈసారైనా నోటిఫికేషన్ వచ్చేనా?
ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లో తాత్కాలిక ట్రైబల్యూనివర్సిటీని ఏర్పాటుచేసి 2019 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు తొలుత భావించారు. అడ్మిషన్లకు సెప్టెంబర్మొదటి వారంలో నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్ బాధ్యతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)కి అప్పగించారు. కానీ పలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఏడాది నోటిఫికేషన్ వెలువడలేదు. ఈసారి కరోనా కారణంగా ఇప్పటికి నోటిఫికేషన్ ముచ్చటే ఎత్తడంలేదు. దీనిపై రాష్ట్ర సర్కారు చొరవ చూపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే ఏమైనా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలపై ట్రైబల్ యూత్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తిచేసి, ఈ విద్యాసంవత్సరం నుంచైనా క్లాసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తా ..
ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని ఈ అసెంబ్లీ సమా వేశాల్లో చర్చిస్తా. యూనివర్సిటీకి కావా ల్సిన స్థలాన్ని గుర్తించినా ఇంకా అడ్మి షన్లు ఎందుకు ప్రారంభించడం లేదో అడుగుతా. టెంపరరీ క్లాసుల కోసం వైటీసీ భవనాన్ని సైతం ఖాళీ చేయిం చారు. సెంట్రల్నుంచి ఆఫీసర్లు వచ్చి చూసి వెళ్లారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ములుగులో యూనివర్సిటీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
‒ సీతక్క, ములుగు ఎమ్మెల్యే