ఆశ్చర్యపడుతున్న ఎనలిస్టులు
ముంబై: క్వార్టర్లీ ఎర్నింగ్స్ కాల్లో ఇండియా మార్కెట్ గురించిన ప్రస్తావనే అమెజాన్ తేలేదు. 2014 తర్వాత మన దేశపు మార్కెట్ గురించి మాట్లాడకుండా ఉండటం ఇదే మొదటిసారి. అమెజాన్ పోకడ చాలా మంది ఎనలిస్టులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు టెక్క్రంచ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు, ఇండియా మార్కెట్లో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా అనే సందేహాలనూ ఎనలిస్టులలో రేకెత్తించిందని ఈ రిపోర్టు పేర్కొంది. సౌత్ ఏషియాలో ఈ–కామర్స్ (ఆన్లైన్ వ్యాపారాలు) హై గ్రోత్ రేటుతో దూసుకెళ్తున్న నేపథ్యంలో అమెజాన్ ఇలా ఎందుకు చేసిందో అర్ధం కావడం లేదని ఎనలిస్టులు అంటున్నారు. ఇండియా మార్కెట్లో గత పదేళ్లలో అమెజాన్ సుమారు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. కానీ, వాల్మార్ట్ సపోర్ట్ ఉన్న ఫ్లిప్కార్ట్నుంచి అమెజాన్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఫ్లిప్కార్ట్ కిందటేడాదిలోనే 2.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు పై రిపోర్టు వెల్లడించింది.
ఈ ఏడాది జనవరిలో ఇండియాలోని 1,000 మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. గ్లోబల్గా చేపట్టిన రిట్రెంచ్మెంట్ ఎక్సర్సైజులో భాగంగానే ఈ ఉద్యోగులను అమెజాన్ ఇంటికి పంపించింది. గ్లోబల్గా ఎకనమిక్ కండిషన్లు అంతగా బాగుండకపోవడం వల్లే అన్ని దేశాలలోనూ కలిపి మొత్తం 18 వేల జాబ్స్పై అమెజాన్ వేటు వేసింది. ఇండియాలో వెయ్యి మంది ఉద్యోగులను తీసేయడానికి ముందు అమెజాన్కు లక్ష మంది ఉద్యోగులున్నారు. ఇండియా మార్కెట్పై మరింత పట్టు సాధించాలనే ప్రయత్నాలనూ అమెజాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పారామౌంట్ గ్లోబల్తో కలిసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంటర్టెయిన్మెంట్ ఆఫరింగ్స్ను మన దేశపు మార్కెట్లోకి తేనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెజాన్ ప్రకటించింది. ఎలాంటి అదనపు ఖర్చూ లేకుండానే ప్రస్తుత సబ్స్క్రిప్షన్తోనే యూజర్లు ఈ కంటెంట్ను చూడొచ్చని తెలిపింది.
