- రేపు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 24వ కాన్వొకేషన్
- 94,206 మందికి డిగ్రీ పట్టాలు
- 128 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్
- వివరాలు వెల్లడించిన వీసీ సీతారామారావు
జూబ్లీహిల్స్, వెలుగు : ఈ నెల 6న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 24వ కాన్వొకేషన్ వేడుకలను నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ సీతారామారావు తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్ లోని వర్సిటీ సెమినార్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం వర్సిటీలోని భవనం వెంకట్రామ్ రెడ్డి ఆడిటోరియంలో కాన్వొకేషన్ ఉంటుందన్నారు. గవర్నర్ తమిళిసై చీఫ్ గెస్టుగా హాజరై ఎంఫిల్, పీహెచ్ డీ స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారన్నారు.
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ప్రెసిడెంట ఆశా ఎస్ కన్వార్ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. 2019-–21 సంవత్సరంలో అర్హత సాధించిన 94,206 మంది స్టూడెంట్లకు కాన్వొకేషన్లో డిగ్రీ, డిప్లొమా పట్టాలను అందిస్తామన్నారు. యూజీలో 43, పీజీలో 85 సహా మొత్తం 128 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. 19 మంది రీసెర్చ్ స్కాలర్లకు పీహెచ్డీ పట్టాలను అందిస్తామన్నారు. కాన్వొకేషన్ ప్రోగ్రామ్ అంబేద్కర్ వర్సిటీ యూట్యూబ్ చానెల్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ అవుతుందన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, ప్రొఫెసర్ సుధారాణి పాల్గొన్నారు.