అంబర్ పేట, వెలుగు : అధిష్ఠానం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు ఇచ్చిన టికెట్పై పున : పరిశీలించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం తన క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు న్యాయం చేయని ఎమ్మెల్యేను మరోసారి ఎన్నుకునేందుకు సుముఖత చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్రం సాధించకున్నాక 2014లో తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.
2018లో తన మిత్రుడు కాలేరు వెంకటేశ్కు అధిష్టానం టికెట్ ఇవ్వగా పార్టీ నేతలందరం కలిసి కట్టుగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు. 2023లో తాను పోటీ చేస్తానని అధిష్టానానికి విన్నవించగా సానుకూలంగా స్పందించి.. మళ్లీ సిట్టింగ్కే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అంబర్పేటలో గూండాయిజం, దోపిడీ, కబ్జాలకు పాల్పడటం తప్ప.. కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అభ్యర్థిని ఎన్నుకునే సమయంలో అధిష్ఠానం మంచి నాయకుడిని చూసి ఎన్నుకోవాలని సుధాకర్ రెడ్డి కోరారు.