- ఐమ్యాక్స్, అంబేద్కర్ స్టాచ్యూ మధ్యన ఖాళీ స్థలంలో ఏర్పాటు
- ఎగ్జిబిషన్లు, ఈవెంట్ల నిర్వహణ కోసం..
హైదరాబాద్సిటీ, వెలుగు: నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా అంటే తెలియని వారు ఉండరు. ఎగ్జిబిషన్లు, వినోద కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర ఈవెంట్ల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ దీన్ని ఏర్పాటు చేశారు. ట్యాంక్బండ్కు ఆనుకుని ఉన్న ఈ విశాలమైన స్థలంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే మరో ఈవెంట్సెంటర్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్మార్గ్లోని భారీ అంబేద్కర్విగ్రహం, ఐమ్యాక్స్థియేటర్కు మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో పీపుల్స్ప్లాజా వంటి మరో ఈవెంట్సెంటర్ను తీర్చిదిద్దుతున్నారు.
3.8 ఎకరాల్లో ఈవెంట్ సెంటర్
ఐమాక్స్కు ఆనుకుని ఉన్న హెచ్ఎండీఏ స్థలం దాదాపు 3.8 ఎకరాలు ఉండడంతో దీన్ని ఇప్పుడు చదును చేయిస్తున్నారు. ఈ ప్లేస్లో పీపుల్స్ప్లాజా మాదిరిగానే ఎగ్జిబిషన్లు, సమావేశాలు, ఈవెంట్లు నిర్వహించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం నగరంలో భారీ సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇందులో కొన్నింటిని నెక్లెస్రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్స్టేడియంలలో నిర్వహిస్తున్నారు. మరి కొందరు అవసరమైన స్థలం దొరక్క శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎన్టీఆర్మార్గ్లో నిర్మిస్తున్న ఈవెంట్సెంటర్పూర్తయితే అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని, హెచ్ఎండీఏకు ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు. వాహనాల పార్కింగ్కు కూడా ప్లేస్ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉంటుందంటున్నారు.
ఖాళీగా అనేక స్థలాలు
ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, నెక్లెస్రోడ్లోని అనేక ప్రాంతాల్లో హెచ్ఎండీఏకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు ఆయా స్థలాల్లో షాపులు, ఫుడ్కోర్టులు, పెడుతున్నారు. దీనివల్ల స్థలాలు ఉన్నా ఉపయోగించుకోలేక హెచ్ఎండీఏకు ఆదాయం రాకుండా పోతోంది. పైగా కొన్ని స్థలాను కొందరు అక్రమంగా పార్కింగ్కు వాడుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఐమాక్స్పక్కనున్న భూమిని కాపాడడంతో పాటు సంస్థకు ఆదాయం తెచ్చేందుకు ఈవెంట్ సెంటర్ఏర్పాటు చేయాలని ప్లాన్లు సిద్ధం చేసింది.
