భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్ట్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ఆద్ వాడకోట్ మెటా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
బలగాలు జరిగిన కాల్పుల్లో బైరంగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు మడవి ఫగ్నూ చనిపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించగా... 303 రైఫిల్, 9 ఎంఎం పిస్టల్, పేలుడు పదార్థాలు, మెడికల్ కిట్స్, రేడియోలు, స్కానర్లు, నిత్యావసర సరుకులు దొరికాయి. చనిపోయిన మావోయిస్ట్ మడవి ఫగ్నూపై రూ. 5 లక్షల రివార్డ్ ఉందని, పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు.
