వాషింగ్టన్: గ్రీన్కార్డులు లేదా శాశ్వత నివాస హోదా కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది ఇండియన్లకు అమెరికా శుభవార్తను చెప్పింది. గ్రీన్కార్డు దరఖాస్తులన్నింటినీ 6 నెలల్లోగా పరిష్కరించాలంటూ యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్)కు ప్రెసిడెన్షియల్ కమిషన్ ప్రతిపాదించింది. ఇండియన్ అమెరికన్ అజయ్ జైన్ భుటోరియా ప్రవేశపెట్టిన ఆ ప్రతిపాదనను ప్రెసిడెన్షియల్ కమిషన్లోని 25 మంది కమిషనర్లు ఆమోదించారు. ఆ ప్రతిపాదనలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆమోదానికి వైట్హౌస్కు పంపారు. వాటికి ఆమోదముద్ర పడితే ఇండియన్లతో పాటు లక్షలాది మంది వలసదారులకు మేలు కలగనుంది.
ఇవీ ప్రతిపాదనలు..
ఇప్పటికే పెండింగ్లో ఉన్న గ్రీన్కార్డుల అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాల్సిందిగా యూఎస్సీఐఎస్కు ప్రెసిడెన్షియల్ కమిషన్ సూచించింది. గ్రీన్కార్డు దరఖాస్తుల ప్రక్రియ, వ్యవస్థ, విధానాలపై సమీక్ష చేయాలని చెప్పింది. గ్రీన్కార్డులను నిర్ణీత కాలంలో అందించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించింది. గ్రీన్కార్డులకు మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఆమోదం తెలిపే వ్యవస్థను తేవాలని పేర్కొంది. ఇంటర్నల్ డ్యాష్బోర్డులు, రిపోర్టింగ్ సిస్టమ్స్ను మెరుగుపర్చాలని, కుటుంబ గ్రీన్కార్డుల దరఖాస్తులు, డీఏసీఏ పునరుద్ధరణలు, ఇతర గ్రీన్ కార్డ్ అప్లికేషన్లను 6నెలల్లోగా పరిశీలించి నిర్ణయం తెలియజేయాలని చెప్పింది. దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు త్వరగా పూర్తిచేసేందుకు ఆగస్టు నాటికి మరింత మంది అధికారులను నియమించుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఏటా 32,439 గ్రీన్కార్డులకు ఆమోదం తెలుపుతున్నారని, ఈ ఏడాది గ్రీన్కార్డులను 150 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. వర్క్పర్మిట్స్, ట్రావెల్ డాక్యుమెంట్లు, నివాసహోదా తాత్కాలిక పొడిగింపుకోసంపెట్టుకున్న విజ్ఞప్తులను 3 నెలల్లోగా సమీక్షించాలని యూఎస్సీఐఎస్కు సూచించింది.