మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే.. చైనా పై అమెరికా సీరియస్

మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే.. చైనా పై అమెరికా సీరియస్

జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ కూడా చైనా తీరును ఖండించింది. అయితే ఈ విషయంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించగా… బీజేపీ నేతలు ప్రతివిమర్శలకు దిగారు.

జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా వీటో  చేసిన చైనాపై అమెరికా రగిలిపోతోంది. మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాల్సిందేనని లేదంటే శాంతి, సుస్థిరతకు భంగం కలుగుతుందని తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటంలో చైనా సీరియస్ గా ఉంటే… పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాదులను కాపాడొద్దని చైనాకు సూచించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి. భద్రతా మండలిలోని అల్ ఖాయిదా శాంక్షన్స్ కమిటీ కింద మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని… అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్ లు ప్రతిపాదించాయి. అయితే దానిని చివరి నిమిషంలో అడ్డుకుంది చైనా. ప్రతిపాదనపై కచ్చితమైన, లోతైన అంచనాకు రావాల్సి ఉందని… తమకు మరింత సమయం కావాలని కారణం చెప్పుకుంది డ్రాగన్. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడడం ఇది నాలుగోసారి. చైనా ఇలాగే చేస్తే… భద్రతా మండలిలో మిగతా సభ్యదేశాలు ఇతర చర్యలు తీసుకుంటాయన్నారు అమెరికా ప్రతినిధి.

మసూద్ అజర్ అంశం భారత్ లో రాజకీయ గగ్గోలు పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా ప్రధాని మోడీ బలహీనత బహిర్గతమైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అంటే మోడీ భయపడుతున్నారని ట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మరోసారి పైచేయి సాధించిందన్నారు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. చైనాతో జరిపిన చర్చలు ఏమయ్యాయని మోడీని ప్రశ్నించారు. మోడీ దౌత్యం విఫలమైందన్నారు MIMఅధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.

రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ ఎందుకంత ఆనందంగా ఉన్నారోనని ప్రశ్నించారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. చైనాతో రాహుల్ కు మంచి సంబంధాలున్నాయన్న రవిశంకర్… మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేలా ఇన్ ఫ్లుయెన్స్ చేయొచ్చుగా అని ప్రశ్నించారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అంత ఔదార్యం ఉంటే… మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించాలన్నారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు పాక్ తో చర్చలుండవన్నారు.

మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపడిన చైనా తీరుపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ కు మద్దతు తెలిపిన దేశాలకు థ్యాంక్స్ చెప్పింది.