చైనాలో పర్యటించాలనుకుంటున్న అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో పర్యటనకు వెళ్లే వారు మరోసారి ఆలోచించుకోవాలని సూచించింది. అక్కడి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు అమెరికన్లకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.
విమర్శిస్తే తట్టుకోలేదు..
చైనా ప్రభుత్వంపై విదేశీయులు విమర్శలు చేస్తే అస్సలు సహించదు..తట్టుకోలేదని అమెరికా పేర్కొంది. అలాంటి వారిని తక్షణమే నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా చైనా ప్రభుత్వంపై విమర్శించే వారిని దేశం నుంచి వెళ్లిపోకుండా ఎగ్జిట్ బ్యాన్ విధిస్తోందని తెలిపింది. విదేశీయులను అరెస్ట్ చేసే సమయంలో కనీసం నేరారోపణలను కూడా వెల్లడించడం లేదని పేర్కొంది. చైనా ప్రభుత్వం ఆర్బిట్రరీ చట్టాలను కఠినంగా అమలు చేస్తోందని..కాబట్టి చైనాలో పర్యటించాలనుకుంటున్న అమెరికన్లు మరోసారి ఆలోచించుకోవాలని సూచించింది.
గూఢచర్యానికి పాల్పడితే జీవిత ఖైదు..
అమెరికా పాస్ పోర్టు కలిగిన ఓ వ్యక్తి..హాంగాకాంగ్ లో నివసించాడని..అయితే అతను గూఢ చర్యానికి పాల్పడినే నేరం కింద చైనా ప్రభుత్వం జీవిత ఖైదు విధించిందని అమెరికా తన ట్రావెల్ అడ్వైజరీలో ప్రస్తావించింది. కనీసం ఎప్పుడు అరెస్ట్ చేశారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదని తెలిపింది.
డ్రగ్స్ తీసుకోవద్దు..నిరసన జోలికి పోవద్దు..
చైనా వెళ్లేముందు కానీ..లేదా చైనాలో ఉన్నపుడు కానీ డ్రగ్స్ తీసుకోవద్దని అమెరికన్లకు సూచించింది. అంతేకాకుండా చైనాలో జరిగే నిరసన ప్రదర్శనల జోలికి పోవద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. చైనాలోనే కాదు హాంగ్ కాంగ్, మకావూలలో పర్యటించే సమయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.