అన్నదాత ఇంట్లో అన్నం తిన్న అమిత్ షా

అన్నదాత ఇంట్లో అన్నం తిన్న అమిత్ షా

కోల్‌ కతా: వెస్ట్ బెంగాల్ సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్‌  మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో కలిసి భోజనం చేశారు. ఓ వైపు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మెజార్టీ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు కొందరు రైతుల మద్దతు పొందేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వారితో సమావేశాలు జరుపడంతోపాటు విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు.

శ‌నివారం తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల‌కు కోల్‌ క‌తా చేరుకున్న విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. కోల్‌ క‌తాకు చేరుకున్నాను. గురుదేవ్ ఠాగూర్‌, ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్‌, శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వంటి గొప్ప నాయ‌కుల గ‌డ్డ మీద అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఈ భూమికి న‌మ‌స్క‌రిస్తున్నానని ట్వీట్ చేశారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమిత్ షా శనివారం కోల్‌ క‌తాలోని స్వామి వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. రామ‌కృష్ణ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. శనివారం సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతారు అమిత్ షా. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, నేతలు అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరవచ్చని సమాచారం.