చేవెళ్ల సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్న అమిత్ షా.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ అంటే తమకు భయం లేదని చెప్పారు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఈ సభ నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పనితీరును దేశం మొత్తం చూస్తోందని చెప్పారు.
పేపర్ లీకేజీ వ్యవహారంపై కూడా అమిత్ షా స్పందించారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా మాట్లాడిన బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని అన్నారు. కేసీఆర్ కు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కూడా భయపడరని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ ను గద్దేదించేవరకు బీజేపీ కార్యకర్తలు నిద్రపోరని అన్నారు. 35 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ రోడ్డుపైన పడేశారని అమిత్ షా అన్నారు. పేపర్ లీకేజీపై ఇంతవరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.