కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫ్లైట్ అసోంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా త్రిపుర వెళ్తున్న అమిత్ షా ఫ్లైట్ ను అధికారులు అసోంకు మళ్లించారు. బుధవారం రాత్రి 10.45 గంటలకు త్రిపుర క్యాపిటల్ అగర్తలలోని మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ ను అసోంలోని గువాహటి లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. అమిత్ షాకు సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకి వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో అమిత్ షా బుధవారం రాత్రి అగర్తలాకు వెళ్లాల్సి ఉంది. ప్రచారంలో భాగంగా ఇవాళ రెండు రథయాత్రలను ప్రారంభించాలి. అయితే షెడ్యూల్ ప్రకారమే అమిత్ షా రథయాత్రలను ప్రారంభించి బహిరంగ ర్యాలీలో పాల్గొంటారని త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్జీ తెలిపారు.