- వ్యాక్సిన్ సప్లయ్ పెంచేందుకు ప్రభుత్వ చొరవ
న్యూఢిల్లీ: వ్యాక్సిన్స్ సప్లయ్ పెంచేందుకు రెండు వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు రూ. 4,500 కోట్ల డబ్బు అడ్వాన్స్గా ఇస్తున్నట్లు ఫైనాన్స్మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రోగ్రామ్ను మే 1 నుంచి అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తగినన్ని వ్యాక్సిన్స్ను అందుబాటులోకి తేవడానికి ఈ డబ్బును ప్రభుత్వం సమకూరుస్తోంది. 20 కోట్ల వ్యాక్సిన్స్ సప్లయ్ కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్కు రూ. 3 వేల కోట్లు, 9 కోట్ల వ్యాక్సిన్స్ సప్లయ్ కోసం భారత్ బయోటెక్కు రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ఇవ్వనుంది. జులై నాటికి ఈ వ్యాక్సిన్స్ను సప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసుకు రూ. 150 రేటును నిర్ణయించారు. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేందుకు రూల్స్ను రిలాక్స్ చేసినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఈ అడ్వాన్స్ పేమెంట్ జరపనున్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్స్ తయారీ కోసం రూ. 3, 000 కోట్లు అవసరమని ఈ నెల మొదట్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పిన విషయం తెలిసిందే. మూడో ఫేజ్ వ్యాక్సినేషన్ స్ట్రేటజీ కింద వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రొడక్షన్ కెపాసిటీలో సగాన్ని ప్రతి నెలా తమకు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యధాప్రకారం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో ఫ్రీగానే వ్యాక్సినేషన్ అందించనున్నట్లు పేర్కొంది. తాజా డేటా ప్రకారం 2.59 లక్షల కొత్త కేసులతో కరోనా రోగుల సంఖ్య మొత్తం 1.53 కోట్లకు చేరింది. యూఎస్ తర్వాత కరోనా రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం ఇండియానే.
కోవాగ్జిన్ కెపాసిటీని 70 కోట్లకు పెంచాం...భారత్ బయోటెక్
కోవిడ్–19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ ప్రొడక్షన్కెపాసిటీని 70 కోట్లకు పెంచినట్లు భారత్ బయోటెక్ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరులలోని ఫెసిలిటీలలో దశలవారీగా ఈ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచగలిగినట్లు పేర్కొంది. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్లో సేఫ్టీ ఎక్కువని, కాకపోతే తయారీ ఖరీదైనదని భారత్ బయోటెక్ తెలిపింది. లైవ్ వైరస్ వ్యాక్సిన్స్తో పోలిస్తే వీటిలో ఈల్డ్స్ కూడా తక్కువేనని పేర్కొంది. తక్కువ టైములోనే కోవాగ్జిన్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచగలిగామని, ఇందుకోసం బీఎస్ఎల్–3 ఫెసిలిటీస్ను ప్రత్యేక డిజైన్తో అందుబాటులోకి తెచ్చామని వివరించింది. ఇతర దేశాలలోని కంపెనీలతో మాన్యుఫాక్చరింగ్ పార్ట్నర్షిప్స్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కూడా భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవాగ్జిన్ కోసం డ్రగ్ సబ్స్టెన్స్ తయారీకి ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ (ఐఐఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇండియాతోపాటు, మరి కొన్ని దేశాలలోనూ కోవాగ్జిన్కు ఎమర్జన్సీ యూజ్ అప్రూవల్స్ వచ్చినట్లు పేర్కొంది. మెక్సికో, ఫిలిప్పైన్స్, ఇరాన్, పరాగ్వే, గుటిమాలా, నికారుగ్వా, గుయానా, వెనిజులా, జింబాబ్వే సహా మరి కొన్ని దేశాలలో ఇప్పటికే తమ వ్యాక్సిన్కు అనుమతులు వచ్చాయని కంపెనీ తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్కు పర్మిషన్ ఇవ్వండి:జాన్సన్ అండ్ జాన్సన్
తాము తయారు చేసే సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు అనుమతి కావాలని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్కు అమెరికాలోని ఎఫ్డీఏ ఈ ఏడాది ఫ్రిబవరిలోనే అనుమతి ఇచ్చింది. ఎమర్జన్సీ యూజ్ కోసం వివిధ దేశాలలోని ప్రభుత్వ అథారిటీస్తో కలిసి పనిచేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. విదేశీ కంపెనీల వ్యాక్సిన్స్ అన్నింటికీ ఎమర్జన్సీ యూజ్ అప్రూవల్స్ను ఫాస్ట్ట్రాక్పై పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కిందటి వారం నిర్ణయించింది. డబ్ల్యూహెచ్ఓ, యూఎస్, యూరప్, బ్రిటన్, జపాన్ దేశాలలో ఇప్పటికే ఇలాంటి అనుమతులు పొందిన కంపెనీలకు వెంటనే అనుమతులు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి అప్రూవల్ కోసం దరఖాస్తు చేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. రెఫ్రిజిరేటర్ టెంపరేచర్స్ వద్దే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ను స్టోర్ చేసుకునే వీలుంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ–అస్ట్రాజెనెకా తయారు చేసిన ఒక వ్యాక్సిన్, భారత్ బయోటెక్ తయారు చేసిన ఒక వ్యాక్సిన్ ఇప్పటికే మన దేశపు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇంపోర్ట్ డ్యూటీ రద్దు...
కోవిడ్–19 వ్యాక్సిన్స్పై ఇంపోర్ట్ డ్యూటీ 10 శాతాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. విదేశీ వ్యాక్సిన్స్ను తక్కువ రేటుకే అందుబాటులోకి తేవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్స్ సప్లయ్ పెరిగేలా చూడాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. వ్యాక్సిన్స్పై ప్రస్తుతం 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 16.5 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ సర్ ఛార్జ్ కూడా అమలులో ఉంది. దీంతో విదేశీ వ్యాక్సిన్స్ రేటు ఇండియాలోని సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్తో పోలిస్తే ఖరీదవుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ రద్దు ప్రపోజల్ను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొంటున్నారు. విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు సప్లయ్ ప్రపోజల్స్తో ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్ణయం ప్రకటిస్తారని వారంటున్నారు. ఇప్పటిదాకా అలాంటి ప్రపోజల్స్ ఏవీ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.