హైదరాబాద్, వెలుగు : ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఈఈఎంఏ) హైదరాబాద్లో శుక్రవారం ఇంటరాక్టివ్ సదస్సును తెలంగాణ విద్యుత్ రంగ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసింది. దీంతోపాటుగా15వ ఎడిషన్ ఎలెక్రామా కోసం రోడ్షోను నిర్వహించింది.
ఈ సదస్సులో ట్రాన్స్కో మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర రావు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ రావు, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి పాల్గొన్నారు.
దేశంలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించి ఐఈఈఎంఏ నిర్వహిస్తోన్న అతిపెద్ద స్టాండలోన్ షోకేస్ ఎలెక్రామా. ఈ షోను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్ లో నిర్వహిస్తారు. ‘రీ ఇమాజిన్ ఎనర్జీ– ఫర్ సస్టెయినబల్ ఫ్యూచర్’ అనే థీమ్తో దీనిని ఏర్పాటు చేస్తారు. కరెంటు రంగంలో ఇన్నోవేషన్లు, టెక్నాలజీ, ఇంధన పరిరక్షణ, కార్బన్ నెట్ జీరోపై ఈ ఎడిషన్ దృష్టి సారించనుంది.
ఐఈఈఎంఏ , ప్రెసిడెంట్( ఎలెక్ట్) హమ్జా అర్సివాలా మాట్లాడుతూ ఈసారి దాదాపు ఆరు బిలియన్ డాలర్ల విలువ కలిగిన వ్యాపార లావాదేవీలను నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు. తెలంగాణ నుంచి 80 వరకు కంపెనీలు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎలెక్రామాకు దాదాపు 2వేల మంది ఎగ్జిబిటర్లు, 5 కాంకరెంట్ కాన్ఫరెన్స్లు, 50వేల మందికి పైగా సందర్శకులు 70 దేశాల నుంచి వస్తారని ఐఈఈఎంఏ చెబుతోంది.