హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ జీతాలను సర్కారు పెంచింది. ఇప్పటివరకు పార్ట్ టైం సిబ్బందికి రూ. 4 వేలు, ఫుల్ టైం ఉద్యోగులకు రూ. 5 వేలు ఇస్తుండగా.. వీళ్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాన్ని రూ.8,500లకు పెంచింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. పంచాయతీ సిబ్బంది పేరును మల్టీపర్పస్ వర్కర్స్గా మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీలకు సర్కారు విడుదల చేసే నిధుల్లోంచి వీరికి జీతాలిస్తామని వెల్లడించారు.
సిబ్బంది నియామకం, వాళ్ల పనులపై మార్గదర్శకాలూ ఇచ్చారు. జీవో విడుదలపై గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు . మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.