- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి.. గెలిచిన తర్వాత అందరం కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో తమ లీడర్లను గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
హుస్నాబాద్ చుట్టూ ఉన్న నాలుగు జిల్లా కేంద్రాల మాదిరిగానే.. పట్టణాన్ని కూడా మరింత డెవలప్ చేస్తామని, ఇందుకోసం అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. రాజకీయం చేయాలనుకుంటే తాము వెనకాడబోమని, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం మొండిగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీని మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. పట్టణంలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ వంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం కొత్త పాలకవర్గంతో కలిసి పట్టణంలోని మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, మంజులారెడ్డి, లింగమూర్తి, అక్కు శ్రీనివాస్ పాల్గొన్నారు.
