బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలోని కంపెనీలపై ర్యాన్సమ్ వేర్ అటాక్స్ పెరిగాయి. గత ఆరు నెలల్లో దేశంలోని సగటు ఆర్గనేజేషన్పై వారానికి 1,787 సార్లు ర్యాన్సమ్ అటాక్స్ జరిగాయని సాఫ్ట్వేర్ కంపెనీ చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ పేర్కొంది. వారానికి ప్రతి 40 కంపెనీల్లో ఒక కంపెనీ సైబర్ దాడుల వలన ఇబ్బంది పడుతోందని వివరించింది. అదే గ్లోబల్గా అయితే సగటు ఆర్గనైజేషన్ వారానికి 983 సార్లు ర్యాన్సమ్ వేర్ అటాక్స్ గురయ్యిందని తెలిపింది. దేశంలో ఎడ్యుకేషన్, హెల్త్కేర్, ప్రభుత్వ సంస్థలు, మిలిటరీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి వివిధ సెక్టార్లలో ర్యాన్సమ్వేర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. జియోపొలిటికల్ టెన్షన్లు పెరగడంతో పాటు, రిమోట్ వర్కింగ్, ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువవుతుండడంతో సైబర్ అటాక్స్ కూడా పెరుగుతున్నాయని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ తెలిపింది. అంతేకాకుండా ర్యాన్సమ్ అటాక్స్ గురయిన కంపెనీలు సైబర్ నేరగాళ్లకు చెల్లింపులు చేయడానికి ఒప్పుకోవడం కూడా పెరుగుతోందని అందుకే సైబర్ అటాక్స్ ఎక్కువవుతున్నాయని వివరించింది.
సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు..
1 ఆఫ్రికా దేశాల్లో ప్రతి 21 కంపెనీల్లో ఒక కంపెనీ ర్యాన్సమ్ వేర్ అటాక్స్కు గురవుతోంది. ఈ అటాక్స్ ఏడాది ప్రాతిపదికన 21 శాతం పెరిగాయి.
2 యూరప్లోని ప్రతి 66 కంపెనీల్లో ఒక కంపెనీ, నార్త్ అమెరికాలోని ప్రతి 108 కంపెనీల్లో ఒక కంపెనీ సైబర్ దాడులకు గురవుతోంది.
3ఆస్ట్రేలియా –న్యూజిలాండ్లో వారంలో ప్రతి 113 కంపెనీల్లో ఒక కంపెనీపై ర్యాన్సమ్ అటాక్స్ జరుగుతున్నాయి.
దేశంలో ఇవే ఎక్కువ..
ఈ ఏడాది జూన్ క్వార్టర్లో వారంలో జరిగే ర్యాన్సమ్ అటాక్స్ అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే 9 శాతం తగ్గాయని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ వెల్లడించింది. దేశంలో రెండు బ్యాంకింగ్ ట్రోజోన్లు, రెండు బోట్నెట్స్, ఒక ఇన్ఫోస్టీలర్ల(ర్యాన్సమ్వేర్లో రకాలు) అటాక్సే ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని 6 శాతం కంపెనీలపై మాల్వేర్లో ఒకరకమైన గ్లూప్టెబా అటాక్స్ జరిగాయి. చెక్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం, గత నెల రోజుల్లో దేశంలో జరిగిన సైబర్ దాడుల్లో 89 శాతం దాడులు ఈ –మెయిల్స్ ద్వారానే జరిగాయి. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ (ఎక్కడి నుంచైనా సైబర్ నేరగాడు సిస్టమ్పై దాడి చేయగలడు) దాడులే దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ వివరించింది.