
అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో కొణతాల మోహనన్ కుమార్, ఆర్.శ్రీచరణ్ కలిసి నిర్మించారు. ఈ సినిమా రేపటి నుంచి ఆహాలో స్ట్రీమ్ కానున్న సందర్భంగా నిన్న ప్రసాద్ ల్యాబ్స్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు. బ్రహ్మానందం, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్ వినడానికి చాలా బాగుంది. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన అలీ ఈ సినిమాతో నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘నేను, అలీ ఒకే టైమ్లో కెరీర్ స్టార్ట్ చేశాం.
నటుడిగా, హీరోగా ఎదుగుతూ వచ్చాడు. మంచి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని, సీనియర్ యాక్టర్స్తో తీసిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. అలీ మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన ‘వికృతి’ చిత్రానికి రీమేక్ ఇది. నరేష్, నేను పోటాపోటీగా నటించాం. ఇరవై ఏడేళ్ల తర్వాత మంజుభార్గవి గారితో నటించడం ఆనందంగా ఉంది. అందరూ నవ్వుతూ ఉండాలనే ఈ చిత్రాన్ని తీశాం’ అన్నాడు. కథకి ఈ టైటిల్ యాప్ట్ అన్న దర్శక నిర్మాతలు.. తమకి సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. పృథ్వీరాజ్, శివ బాలాజీ, భద్రం, మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ పళిడమ్ తదితరులు పాల్గొన్నారు.