40 నిమిషాలకు పైగా కేసీఆర్​, జగన్ ప్రత్యేక భేటీ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!

40 నిమిషాలకు పైగా కేసీఆర్​, జగన్ ప్రత్యేక భేటీ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
  • 40 నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
  • అనంతరం లోటస్​పాండ్​కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్​ పలకరింపు

హైదరాబాద్, వెలుగు :  తుంటి మార్పిడి ఆపరేషన్ ​చేయించుకున్న బీఆర్ఎస్ ​చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ను ఏపీ సీఎం జగన్​పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట ఎయిర్​పోర్టుకు జగన్​ చేరుకున్నారు. ఎయిర్​పోర్టులో మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి, బీఆర్ఎస్​ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నందినగర్​లోని కేసీఆర్​ ఇంటికి జగన్​ చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ ​అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్ ​స్వాగతం పలికారు. అనంతరం ఫస్ట్​ ఫ్లోర్​లోని కేసీఆర్​ గదికి వెళ్లిన జగన్​ఆయనకు పుష్పగుచ్చం అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి ఫొటోను బహూకరించారు. కాసేపు నేతల సమక్షంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి జగన్​ అడిగి తెలుసుకున్నారు. వారంతా బయటకు వెళ్లాక జగన్, కేసీఆర్​ ఇద్దరే 40 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మార్చి, ఏప్రిల్​ నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. జగన్ ​సోదరి షర్మిల గురువారమే ఢిల్లీలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అదే రోజు జగన్​తెలంగాణ మాజీ సీఎంతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. జగన్​వెంట ఎంపీ మిథున్​రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిలా రాఘురాం ఉన్నారు.

రెండేండ్ల తర్వాత లోటస్​పాండ్​ ఇంటికి జగన్​

కేసీఆర్​ నివాసం నుంచి లోటస్​పాండ్​లోని తన నివాసానికి జగన్ ​రెండేండ్ల తర్వాత వెళ్లారు. అక్కడ తల్లి విజయమ్మతో అరగంట పాటు మాట్లాడి బేగంపేట​ ఎయిర్​పోర్టుకు వెళ్లిపోయారు. కాంగ్రెస్​లో చేరడానికి షర్మిల వెంట ఆమె కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వెళ్లడంతో గురువారం విజయమ్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. షర్మిల త్వరలోనే ఏపీ పీసీసీ చీఫ్​పగ్గాలు చేపడుతారనే ప్రచారం నేపథ్యంలో తల్లి విజయమ్మను జగన్​కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.