- కృష్ణా నుంచి తీసుకెళ్లేందుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించింది
- బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
- సాగర్ కుడి కాల్వ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా నీళ్లను తరలించుకునేందుకు అనుమతులున్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్ నుంచి ఔట్సైడ్ బేసిన్కు నీళ్ల తరలింపుపై ఎలాంటి నిషేధం లేదని, నీటిని తరలించుకోవచ్చని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తెలిపింది. బచావత్ ట్రిబ్యునలే అందుకు చట్టబద్ధత కల్పించిందని పేర్కొంది. ఇతర ట్రిబ్యునళ్లు కూడా ఔట్ సైడ్ బేసిన్ తరలింపులకు అనుమతులిచ్చాయని తెలిపింది. కావేరి నదీ జలాలను ఔట్ సైడ్ బేసిన్లో ఉన్న బెంగళూరుకు తరలించేందుకు కావేరి ట్రిబ్యునల్, నర్మదా జలాలను ఎడారి ప్రాంతమైన రాజస్థాన్కు తరలించేందుకు ఆ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపాయని వాదించింది.
గురువారం ట్రిబ్యునల్లో ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా వాదనలు వినిపించారు. బేసిన్లో ఉన్న ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కాదని, మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా సిస్టమ్స్కు ఉన్న కేటాయింపుల పరంగా ఔట్సైడ్ బేసిన్కు నీటిని తరలించేందుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించిందని చెప్పారు.
ఆ రాష్ట్రానికి ఆంక్షలున్నయ్
మహారాష్ట్రలోని కోయ్న, టాటాహైడల్ ప్రాజెక్ట్లకు సంబంధించి 122 టీఎంసీలను కేటాయించారని, అయితే, అంతకుమించి ఒక్క చుక్క కూడా వాడుకోరాదన్న ఆంక్షలున్నాయని ఏపీ అడ్వొకేట్ జయదీప్ గుప్తా వాదించారు. అలాంటి ఆంక్షలు ఏపీకి లేవన్నారు. విభజనచట్టంలోని 11వ షెడ్యూల్లోని క్లాజ్లో నాలుగు ప్రాజెక్టులను ఔట్సైడ్ బేసిన్కు తరలించే ప్రాజెక్టులుగా చూపించారన్నారు. పెన్నా బేసిన్లో నీటి లభ్యత లేదని, చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో కృష్ణా నీళ్లను ఆ బేసిన్కు తరలించకుంటే ఆ ప్రాంతమంతా ఎడారిలా మారుతుందన్నారు.
రాయలసీమ అత్యంత కరువు ప్రాంతమన్నారు. ఆ ప్రాంతానికి కృష్ణా నీళ్లను గ్రావిటీ ద్వారా తీసుకుపోయే వీలుందని, అందుకే ఆ నీళ్లు పంటలకు పారించొచ్చన్నారు. అదే సమయంలో తెలంగాణ ఎత్తైన ప్రాంతంలో ఉంటుందని, కనుక లిఫ్ట్ స్కీమ్స్ తప్పనిసరి అని వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 4 (1)లో ఔట్సైడ్ బేసిన్ డైవర్షన్ల గురించి ప్రస్తావించారన్నారు. కాగా, తదుపరి వాదనలు జనవరి 21 నుంచి 23 వరకు జరగనున్నాయి.
సెక్షన్ 3పై విచారణ జనవరికి వాయిదా
తొలుత రాష్ట్రాల వారీ కేటాయింపులపై విచారణ జరిపేందుకు కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన సెక్షన్3 ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. తొలుత విభజనచట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు వినాలని, ట్రిబ్యునల్ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. కోర్టు ట్రిబ్యునల్లో జరుగుతున్న వాదనల గురించి ఆరా తీసింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విచారణ చేపడతామని చెబుతూ వాయిదా వేసింది.
