- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహణ
- హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షోలతో సందడి
- ఏర్పాట్లపై అధికారులతో జయేశ్ రంజన్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జనవరి 13 నుంచి 18 వరకు పర్యాటకులను ఆకర్షించేందుకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దీంతోపాటు డ్రోన్ షో, హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గురువారం బేగంపేటలోని ప్లాజా హోటల్లో రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సమీక్షించారు.
ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. అనంతరం పోస్టర్ రిలీజ్ చేశారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, డ్రోన్ డే సందర్భంగా 13, 14వ తేదీల్లో డ్రోన్ ఫెస్టివల్, 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ఎండీ వల్లూరు క్రాంతి, సాట్ వీసీ, ఎండీ సోని బాల, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.
