తుఫాన్ అలర్ట్ : ఏపీ దివి సీమలో కుండపోత వర్షాలు

తుఫాన్ అలర్ట్ : ఏపీ దివి సీమలో కుండపోత వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్​లోని దివిసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్​ లో   భారీ వర్షాలు కురుస్తూ,గాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజలు భారీ వర్షం..ఈదురు గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీకి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని సూచించింది. విపత్తు నిర్వహణ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. సోమవారం (డిసెంబర్​ 4)  రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. దీని ప్రభావం వచ్చే 48 గంటల  ( డిసెంబర్​ 4,5 తేదీలు)  వరకు వరకూ ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. మిచాంగ్​  ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. 

 శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతుందని పేర్కొంది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. రైతులు.. తమ పొలం పనుల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖాధికారులు  ప్రకటించారు.  ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ వర్షాల తీవ్రత 48 గంటల వరకూ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నందున రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.